అమరావతిలో నిర్మాణాలోద్దు: బాబుకు 'గ్రీన్' షాక్, రెండ్రోజుల్లో అనుమతి!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో శనివారం నాడు చుక్కెదురైంది. పర్యావరణ అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
చదును చేసే పనులను సైతం వద్దని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పింది. తదుపరి విచారణను నవంబర్ నెల మొదటి వారానికి వాయిదా వేసింది.
ఆ లోగా తడి, వరద భూముల పైన సంపూర్ణ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తడి భూములను, ముంపు ప్రాంతాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని చెప్పింది.
కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన నేపథ్యంలో ఏపీ సర్కారు వడివడిగా అడుగులేస్తోంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కార్యక్రమ షెడ్యూల్ కూడా ఖరారైంది.
ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. శంకుస్థాపనను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించిన సీఎం నారా చంద్రబాబు, తమ కేబినెట్ సహచరులతో కలిసి ఏర్పాట్లను రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏపీ సర్కారుకు షాకిచ్చింది.
తుళ్లూరు పరిధిలో జరుగుతున్న భూమి చదును పనులను నిలిపేయాలని ఆదేశించింది. గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వం పనులు మొదలుపెట్టిందని ఓ వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో పిటిషన్ వేశారు. గ్రీన్ కారిడార్ కు విరుద్ధంగా ఏపీ సర్కారు తోటలను తొలగిస్తోందని తన పిటిషన్లో పేర్కొన్నారు.
తన వాదనను బలంగా వినిపించేందుకు అతడు తోటల తొలగింపునకు సంబంధించిన ఫొటోలను కూడా అందజేశారు. ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ తక్షణమే భూమి చదును పనులు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు, అమరావతి నిర్మాణానికి త్వరలో పర్యావరణ అనుమతులు రానున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులకు పర్యావరణ అనుమతుల కమిటీ నుంచి సమాచారం అందింది. సోమ, మంగళవారాల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.