స్మార్ట్ సిటీల జాబితాలో అమరావతి: బెజవాడలో వెంకయ్య, ఘన స్వాగతం
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని స్మార్ట్ సిటీల జాబితాలో చేరుస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం నుంచి వరుసగా నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత తొలిసారిగా వెంకయ్య నాయుడు విజయవాడకు వచ్చారు.
గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి వెంకయ్యకు మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి విజయవాడ వరకు భారీ ర్యాలీగా వచ్చారు. అనంతరం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో వెంకయ్య మాట్లాడుతూ నిర్లక్ష్యానికి గురైన ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ గాడిలో పెట్టారన్నారు.
ప్రపంచం ఆర్థిక మందగమనంలో ఉన్నా, భారతదేశం మాత్రం అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలో యూరియా కొరత లేకుండా ప్రధాని మోడీ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కిలో బియ్యంపై కేంద్రం రూ.27 సబ్సిడీ ఇస్తోందని వెంకయ్య చెప్పారు.
రైతులకు సంబంధించిన ప్రతి విషయంపైనా ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి సారించారని వెంకయ్య వివరించారు. తక్కువ ప్రీమియంకే రైతులకు పంటల బీమా చేస్తామన్నారు. రానున్న రోజుల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ పోలవరం అథారటీ ద్వారానే ప్రాజెక్ట్ పనులు చేపడతామన్నారు.
దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంత సాయం ఏపీకి కేంద్రం ఇస్తుందని ఆయన చెప్పారు. అంతక ముందు ఎంపీలు హరిబాబు, గోకరాజు, మంత్రులు కామినేని, మాణిక్యాలరావులతో ఏపీలో బీజేపీ స్థితిగతులపై మంత్రి వెంకయ్య చర్చలు జరిపారు.