ఏపీ భవిష్యత్కు ప్రతీక అమరావతి, పోలీసుల సాక్షిగా అమరావతిలో రాళ్లు, చెప్పుతో దాడి: చంద్రబాబు
అమరావతి పర్యటనలో భాగంగా రాళ్లతో దాడులు చేయడాన్ని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఖండించారు. రాజధాని ప్రాంతాన్ని పరిశీలించే క్రమంలో దాడులు చేయడం సరికాదన్నారు. వైసీపీ రౌడీలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. అమరావతి శాంతి భద్రతల సమస్య ఏం లేదని.. అందుకే 144 సెక్షన్ విధించలేమని చెప్పారు. నిరసన తెలియజేసే హక్కు పౌరులకు ఉంటుందని స్థానిక డీఎస్పీ చెప్పడం దేనికి సంకేతమని చెప్పారు. ఆయన అక్కడే ఉంటే వైసీపీ కార్యకర్తలు రాళ్లు, చెప్పులు విసిరేశారని ఆరోపించారు.
దిక్సూచి..
అమరావతి 13 జిల్లాలకు రాజధాని, భావితరాల భవిష్యత్కు ప్రతీక అని చంద్రబాబు అభివర్ణించారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు సమపాళ్లలో అందాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే ఉత్తమైన రాజధాని నిర్మణానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోని పుణ్య నదులు, పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, నీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశామని చంద్రబాబు తెలిపారు. రాజధాని కులానికో మతానికో సంబంధించినది కాదని.. భావితరాల బంగారు భవిష్యత్కు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
90 శాతం పనులు పూర్తి..
తాము సంకల్పంతో రాజధానిని నిర్మిస్తే పనులను నిలిపివేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధానిలో ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయిపోయాయని చంద్రబాబు తెలిపారు. ఫర్నీచర్ పని పూర్తయిందని.. ఏసీలు కూడా బిగించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఐఏఎస్ క్వార్టర్, జడ్జీల క్వార్టర్ పనులు తుది దశకొచ్చాయని వివరించారు. నూతన హైకోర్టు, ఐదు టవర్ల అసెంబ్లీ పనులు కూడా వేగం పెరిగాయని చెప్పారు.
నిలిపివేస్తారా..?
రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాలను రైతులు ఇస్తే.. ప్రభుత్వం వద్ద మరో 20 వేల ఎకరాలను కలిపితే 54 వేల ఎకరాల భూమితో ప్రణాళిక సిద్దం చేశామని చెప్పారు. అమరావతి రాజధాని 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ పౌరుల దిక్సూచి అని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంతోనే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణం అందిచొచ్చని తెలిపారు.
ఇక సామాన్యుల పరిస్థితి
రాజధాని ప్రాంతంలో నాయకులకే రక్షణ లేదని చంద్రబాబు పేర్కొన్నారు. తమపై రాళ్లతో కొట్టి, చెప్పులు విసరడం కుసంస్కారం అని దుయ్యబట్టారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. జగన్ పాలనను ప్రజలు నిశీతంగా గమనిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.