అమరావతి దళితుల రాజధాని: వారిని తొక్కింది జగన్ రెడ్డి; అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా టీడీపీ షాకింగ్ లెక్కలు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జగన్ సర్కార్ ను, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది టిడిపి. అమరావతి దళితుల రాజధాని అని పేర్కొని ఆ దళితులను ఎదగనివ్వకుండా తొక్కింది జగన్ రెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు రాజధాని అమరావతి ప్రాంతంలోని నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాలలోని దళితుల లెక్కలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
జగన్ ప్రభుత్వానికి అమరావతి రైతుల అల్టిమేటం.. తిరుపతి బహిరంగసభకు అనుమతివ్వకుంటే చేసేదిదే!!
6 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో రాజధాని అమరావతి
అమరావతి 6 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉందని తాడికొండ, వేమూరు, ప్రత్తిపాడు, తిరువూరు, నందిగామ, పామర్రు ఆరు నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలని పేర్కొన్న టిడిపి, దళితులు ఆర్థికంగా ఎదగడానికి ఇష్టంలేక ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజధానిగా అమరావతి ఉండకూడదని మార్చేస్తున్నారు ఇది నిజం కాదా అంటూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. అంతేకాదు అమరావతిలో భూములు ఇచ్చిన వారిలో 95 శాతం మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారని, ఈ చిన్న రైతులలో ఎక్కువమంది దళితులే ఉన్నారంటూ లెక్క చెబుతోంది టిడిపి.
అమరావతికి భూములిచ్చిన వారిలో దళితులైన చిన్నరైతులే ఎక్కువ
20,490 మంది కేవలం ఒక్క ఎకరం లోపు భూములు ఉన్న రైతులు ఉన్నారని, ఒకటి నుండి రెండు ఎకరాల లోపు 5,227 మంది రైతులు ఉన్నారని, 2 నుండి 5 ఎకరాల లోపు 3,337 మంది రైతులు ఉన్నారని ఇలా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు లెక్క చెప్పిన టిడిపి వీరిలో ఎక్కువ మంది దళితులేనని వెల్లడించింది. జగన్ మూడు రాజధానుల నిర్ణయంతో వారికి అన్యాయం జరిగిందని పేర్కొంది. అంతేకాదు అమరావతి పరిధిలో మొత్తం 14 కులాలు ఉంటే ఎస్సీలు అత్యధికంగా 32 శాతం ఉన్నారని కులాల లెక్క చెప్పింది టిడిపి.
అమరావతి పరిధిలో కులాల లెక్క ఇదే
ఎస్సీలు 32 శాతం, రెడ్డి 23 శాతం, కమ్మ సామాజిక వర్గం 18 శాతం, బీసీ 14 శాతం, కాపు 9 శాతం, మైనారిటీ 3 శాతం, ఇతరులు ఒక్క శాతం కులాల వారీగా అమరావతిలో వివరాలు ఇలా ఉంటే కమ్మ రాజధాని అనడానికి సిగ్గు లేదు అంటూ జగన్ సర్కార్ పై విరుచుకుపడింది టిడిపి. తుళ్లూరు మండలంలోని 20 గ్రామాలలో 50 శాతానికి పైగా ఎస్సీలు, ఎస్టీలు ఉంటే కమ్మ రాజధాని అని ముద్రవేసి దళితులను ఎదగనివ్వకుండా చేస్తావా అంటూ జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించింది టిడిపి. అంతేకాదు తుళ్లూరు మండలంలోని గ్రామాలలో ఎస్సీ, ఎస్టీలు ఏమేరకు ఉన్నారో పూర్తి లెక్కలను వెల్లడించింది.
అమరావతి తరలింపుతో నష్టం దళితులకే .. వారిని బానిసలుగా చూస్తున్న జగన్
ఇదే సమయంలో అమరావతిని తరలించడం వల్ల నష్టపోతుంది దళితులేనని జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని టార్గెట్ చేసింది. అంతేకాదు దళితులు ఎప్పుడూ ఓటు బ్యాంకుగా ఉండడానికి వారిని ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేయడానికి జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించింది. జగన్ మోచేతి నీళ్లు తాగడానికి, జగన్ పథకాలకు బానిసలుగా ఉండటానికే అమరావతిని తరలిస్తున్నావ్ అంటూ మండిపడింది. గత ప్రభుత్వం ఆరు ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ప్రజా రాజధాని ఏర్పాటు చేసిందని దళితులు బలహీన వర్గాల కోసం 5024 ఇళ్ల నిర్మాణం చేపట్టిందని తెలుగుదేశం పార్టీ పేర్కొంది.
రాజధాని దళితులకు జగన్ తీరని అన్యాయం .. అంబేద్కర్ వర్ధంతి నాడు టీడీపీ సెన్సేషన్
అంతేకాదు అసైన్మెంట్ భూములకు కూడా రిజిస్ట్రేషన్ హక్కు కల్పించిందని వంద ఎకరాలలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయడానికి నిర్ణయించిందని, దళితుల ఎదుగుదలకు టిడిపి పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. రాజధాని అమరావతి దళితుల రాజధాని అని, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో దళితులకు తీరని నష్టం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ వర్ధంతి రోజున, రాజధాని అమరావతిపై సంచలన విషయాన్ని వెల్లడించింది. రాజధాని ప్రాంత దళితులను జగన్ ఏ విధంగా తొక్కేస్తున్నారో లెక్క చెప్పింది.