అమరావతి అందరి ఆశీస్సులు: వెంకయ్య, గిన్నిస్బుక్లోకి శంకుస్థాపన: సుజనా
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలిరావడం శుభసూచికమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చిరస్థాయిగా వర్ధిల్లుతుందని అన్నారు. రాజధాని అమరావతికి అందరి ఆశీస్సులు ఉన్నాయన్నారు.
గిన్నిస్బుక్ రికార్డుల్లోకి అమరావతి శంకుస్థాపన కార్యక్రమం: సుజనాచౌదరి
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం చరిత్రలో నిలిచిపోవడంతో పాటు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిబ్బంది కూడా రికార్డు నమోదు కోసం రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినట్లు చెప్పారు.
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అమరావతి నిర్మాణానికి నిర్వహిస్తున్న శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది ప్రజలు అమరావతికి తరలివస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే ప్రజలు బస్సుల్లో శంకుస్థాపన ప్రాంతానికి చేరుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కేంద్రమంత్రి అశోక గజపతిరాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సాయం తప్పనిసరని కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్యాకేజీలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సినీనటుడు కృష్ణం రాజు మాట్లాడుతూ అమరావతి రాజధాని కావడం తెలుగువారికి గర్వకారణమన్నారు. సీఎం చంద్రబాబును ఈ సందర్భంగా ఆయన అభినందించారు.