అమరావతి మాస్టర్ ప్లాన్లో హైలైట్స్ : 900ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ సిటీ!,9థీమ్ సిటీలు
రాజధాని పరిధిలో మొత్తం 9 థీమ్ సిటీల నిర్మాణం జరగనుంది. వీటితో పాటు రాజధానికి దారితీసే ఏడు ప్రధాన రహదారులను నిర్మించనున్నారు.
అమరావతి: అసెంబ్లీ కమిటీ హాల్లో అమరావతి పరిపాలన నగర నమూనాపై ప్రెజెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజెంటేషన్ ను రూపొందించిన నార్మన్ ఫోస్టర్ ప్లస్ పార్టనర్స్ అసోసియేట్ ఆర్కిటెక్ట్ హర్ష్ థాపర్ ఎమ్మెల్యేలకు అమరావతి నమూనా గురించి వివరించారు. పోస్టర్ డిజైన్ ప్రదర్శన ద్వారా అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి వివరించారు.
పోస్టర్ డిజైన్స్ లో వివరించిన మేరకు మొత్తం 900ఎకరాల్లో అమరావతి నగర నిర్మాణం జరగనుంది. ఇందులోనే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మించనున్నారు. నది అభిముఖంగా అమరావతి నగరాన్ని 27కిమీ పరిధి మేర నిర్మించనున్నారు. రాజధాని డిజైన్స్ కోసం వివిధ సంస్థల సేవలు ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో విలువైన సలహాలు, సూచనల కోసం ప్రపంచ ప్రసిద్ది చెందిన కన్సల్టెంట్లను నియమించుకునే ఆలోచనలో ఉంది.
రాజధాని పరిధిలో మొత్తం 9 థీమ్ సిటీల నిర్మాణం జరగనుంది. వీటితో పాటు రాజధానికి దారితీసే ఏడు ప్రధాన రహదారులను నిర్మించనున్నారు. ఉగాది పర్వదినాన సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభిస్తారు. అయితే ఈ డిజైన్స్ ను కూడా ప్రభుత్వం ఇంకా పక్కాగా ఖరారు చేయలేదు. ఏప్రిల్ నెలాఖరు నాటికి తుది డిజైన్స్ ఖరారు చేస్తామని ప్రభుత్వం ఇదివరకే చెప్పింది.
2018 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవంతుల నిర్మాణానికి ప్రణాళిక సిద్దం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పోస్టర్ డిజైన్ ప్రదర్శన సందర్బంగా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధి ఇంగ్లీషులో సమాధానం చెప్పడంతో ఐఏఎస్ అధికారి శ్రీధర్ సమాధానాలను తెలుగులోకి అనువదించి చెప్పారు. పోస్టర్ డిజైన్స్ పై ఎమ్మెల్యేలు పలు ప్రశ్నలు సంధించారు.
న్యాయమూర్తులనివాస ప్రాంతానికి సంబంధించిన డిజైన్ చూపించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అడిగారు. ఇక రోడ్ల నమూనా ఇరుకుగా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. దీంతో మధ్యలో కలగజేసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇది తొలి కాపీ మాత్రమేనని, ఇందులో చాలా మార్పులు ఉంటాయని, ఎవరైనా సూచనలు ఇస్తే మార్పులు చేస్తామన్నారు.
కాగా, అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన ఈ పోస్టర్ ప్రదర్శనకు సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
అమరావతి పోస్టర్ డిజైన్ హైలైట్స్:
*మొత్తం 9 థీమ్ సిటీలను నిర్మించనున్నారు.
* పరిపాలన నగరం పక్కనే జస్టిస్ సిటీ ఉంటుంది.
* 900 ఎకరాల్లో అడ్మినిస్ట్రేటివ్ సిటీ ఏర్పాటు
*అమరావతిలో జీఐ సబ్స్టేషన్ ఏర్పాటు
*ఒక ఫైవ్స్టార్ హోటల్ తో పాటు 3 ఫోర్స్టార్ హోటళ్లు నిర్మించనున్నారు.
*అసెంబ్లీ భవనం ముందు మ్యూజియం ఏర్పాటు
*లండన్ లో ఉన్న పబ్లిక్ పార్క్ ను తలపించేలా భారీ ఉద్యానవనం
* అమరావతిలో ప్రతి భవనం స్క్వేర్, రెక్టాంగ్యులర్ ఆకారంలో నిర్మించనున్నారు.
*రోడ్ల మధ్య గ్రీన్ లైన్ నిర్మాణం