రియల్ ఎస్టేట్ బ్రోచర్లా: అమరావతి మాస్టర్ ప్లాన్పై రోజా విసుర్లు
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మాస్టర్ ప్లాన్ రియల్ ఎస్టేట్ బ్రోచర్లా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజా విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది దాటినా, ఇంకా రాజధాని నిర్మాణానికి బ్లూ-ప్రింట్, మాస్టర్ ప్లాన్ వద్దే ఉన్నారని ఆమె విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం చూస్తుంటే రాజధాని నిర్మాణానికి మరో 35 సంవత్సరాలు పడుతుందని స్పష్టమవుతున్నదని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత వరకు ఒక్క రూపాయి విదల్చలేదని ఆమె విమర్శించారు.
రైతుల వద్ద భూసేకరణ చేసి వారికి నష్టపరిహారం చెల్లించలేదని, దీంతో వారి జీవనాధారం ఎలా గడుస్తుందని ఆమె అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారికి నష్టపరిహారం చెల్లించాలని, రాజధాని నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని బృహత్తర ప్రణాళికకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన వీడియోను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా మగధీర, బాహుబలి సినిమాలతో పోల్చిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ హీరోగా మగధీర, ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమాలు వచ్చాయి. వీటితో రాజధాని మాస్టర్ ప్లాన్ను ఆమె పోల్చారు.