అమరావతి పోయి ఆంధ్రప్రదేశ్ వచ్చె: రాష్ట్రం మొత్తానికీ ఆ ప్రాజెక్టు వర్తించే సంకేతాన్ని ఇచ్చిన జగన్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైనట్లు భావించే మెట్రో రైలు ప్రాజెక్టు పేరును మార్చేశారు. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ పేరులో మార్పులు చేశారు. అమరావతికి బదులుగా ఆంధ్రప్రదేశ్ను చేర్చారు. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్గా బదలాయించారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
కొన్ని రాష్ట్రాల్లో పేర్లు మార్పు..
మెట్రో రైలు ప్రాజెక్టు పనులను చేపట్టిన కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో పేర్లను మార్చారని ప్రభుత్వం చెబుతోంది. ఇదివరకు లక్నో మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ పేరును అక్కడి ప్రభుత్వం మార్చింది. దాన్ని ఉత్తర ప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్గా బదలాయించింది. అదే సమయంలో నాగ్పూర్ మెట్రో రైలు కార్పొరేషన్ పేరులో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర మెట్రో రైలు కార్పొరేషన్గా మార్చారు. ఆయా రాష్ట్రాలను అనుసరించి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ పేరులో మార్పులు చేసినట్లు ఈ ఉత్వర్వుల్లో స్పష్టం చేసింది.
రాష్ట్రం మొత్తానికీ వర్తించేలా..
అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఇదివరకే విశాఖపట్నానికి తరలించింది ప్రభుత్వం. మెట్రో రైలు ప్రాజెక్టు అనేది ఒక్క అమరావతికి ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకూడదని, భవిష్యత్తులో రాష్ట్రం మొత్తానికీ ఈ ప్రాజెక్టు అవసరం వస్తుందనే సంకేతాలను ఇచ్చినట్టయింది. తొలిదశలో విశాఖపట్నంలో మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం-భీమిలీ మధ్య మెట్రో రైలు ప్రాజెక్టు పనుల నిర్వహణకు అవసరమైన డీపీఆర్ను సిద్ధం చేయాలంటూ వైఎస్ జగన్ ఇదివరకే ఆదేశించారు. డీపీఆర్ రూపకల్పన ప్రస్తుతం కొనసాగుతోంది.
విశాఖ తరువాత తిరుపతి
భవిష్యత్తులో మెట్రో రైలు ప్రాజెక్టును రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ప్రారంభించేలా చర్యలను తీసుకుంటామని ప్రభుత్వం గతంలో పలుమార్లు స్పష్టం చేసింది. తిరుపతి వంటి కొన్ని ప్రధాన నగరాలకు మెట్రో రైలు సర్వీసులను పరిచయం చేసే అవకాశాలు లేకపోలేదని ప్రభుత్వం పరోక్షంగా వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. తిరుపతి-తిరుమల మధ్య మెట్రో రైలు సర్వీసులను ఆరంభించడానికి గల అవకాశాలను పరిశీలిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం వెల్లడించారు.
Recommended Video
రాష్ట్రాన్ని ప్రతిబింబించేలా..
ఆయా ప్రాజెక్టు పనులన్నీ అమరావతి మెట్రో రైలు కార్సొరేషన్ లిమిటెడ్ సారథ్యంలోనే కొనసాగించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అమరావతి అనే పేరును యధాతథంగా కొనసాగించడం పట్ల ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపట్లేదనే విషయం స్పష్టమైంది. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేలా కాకుండా.. రాష్ట్రం మొత్తాన్నీ ప్రతిబింబించేలా ఈ కార్పొరేషన్ పేరులో మార్పులు చేర్పులు చేసిందని అంటున్నారు. మెట్రో రైల్వే పనులు మాత్రమే కాకుండా మోనో, ట్రామ్ వే ట్రైన్ వంటి ప్రాజెక్టులను కూడా దీని కిందికే చేర్చే అవకాశాలు ఉన్నాయి.