మళ్లీ వేడెక్కిన అమరావతి- వైసీపీ పోటీ ఉద్యమం- బీజేపీ పెయిడ్ ఆర్టిస్టులు, చీరల కామెంట్స్తో..
ఈ మధ్యే 300 రోజులు పూర్తి చేసుకున్న అమరావతి ఉద్యమం చప్పగా సాగిపోతుండగా.. రంగంలోకి దిగిన వైసీపీ, బీజేపీ మళ్లీ దాన్ని వేడెక్కించాయి. అమరావతే రాజధానిగా ఉండాలని కోరుతూ మహిళలు, రైతులు నిర్వహిస్తున్న ఉద్యమానికి పోటీగా వైసీపీ కౌంటర్ ఉద్యమాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. పోలీసు భద్రత మధ్యే కౌంటర్ ఉద్యమం సాగుతుండటం దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. మరోవైపు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీని ఉద్దేశించి బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మంటపుట్టించాయి. దీంతో ఒక్కసారిగా ఉద్యమంలో పాల్గొంటున్న వారిలో ఆక్రోశం కనిపిస్తోంది.
అమరావతి నాటి వైభవం .. నేటి దుస్థితి .. శంకుస్థాపన ప్రాంతంలో రాజధాని రైతుల ఆందోళన
కరోనాలోనూ అమరావతి పోరు..
ఏపీలో కరోనా ప్రభావం ఇంకా అదుపులోకి రాకపోయినా రాజధాని గ్రామాల్లో మాత్రం అమెరావతి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. మాస్కులు ధరించి, టెంట్లలో మహిళలు, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమంలోకి పాల్గొంటూనే ఉన్నారు. తొలి రోజుల్లో ఉద్యమానికి మద్దతుగా పలుమార్లు పర్యటించిన టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ నేతలు ఆ తర్వాత కరోనా కారణంగా దూరమైనా స్ధానికులు మాత్రం ఇప్పటికీ టెంట్లలో దాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఇది 300 రోజులు కూడా పూర్తి చేసుకుంది. జేఏసీ నేతలు ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలను కలిసి మద్దతు కోరారు. అయినా అవి పెద్దగా హైలెట్ కాలేదు. కానీ తాజాగా చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు మాత్రం అమరావతి ఉద్యమాన్ని మరోసారి రగిలిందాయి.
వైసీపీ కౌంటర్ ఉద్యమం...
అమరావతిలో సాగుతున్న ఒకే రాజధాని ఉద్యమానికి కౌంటర్గా దళిత, బహుజనులతో వైసీపీ మరో కౌంటర్ ఉద్యమాన్ని ఎప్పుడో ప్రారంభించింది. అయితే కరోనా నేపథ్యంలో ఇది కాస్తా అటకెక్కింది. తిరిగి ఏఫీ హైకోర్టులో రాజధానిపై జరుగుతున్న కేసుల విచారణ, ఇతర కారణాలతో తిరిగి ఇది ప్రారంభమైంది. అమరావతిలోనే రాజధాని ఉద్యమానికి కౌంటర్గా మూడు రాజధానులకు దళిత, బహుజనుల మద్దతు పేరుతో కొందరు టెంట్లు వేసుకుని ఉద్యమం చేపట్టారు. అమరావతి ఉద్యమకారుల నుంచి వీరికి ముప్పు పొంచి ఉండటంతో పోలీసులు కూడా తగిన భద్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు ఇదే అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న వారికి కంటగింపుగా మారింది. పోలీసుల భద్రతతో వైసీపీ కౌంటర్ ఉద్యమం నడిపించడం ఏంటనే ప్రశ్నను వారు లేవనెత్తుతున్నారు.
బీజేపీ చీరల కామెంట్లతో మరింత రచ్చ..
అమరావతిలో జరుగుతున్న ఉద్యమం విషయంలో ఇప్పటివరకూ కాస్త సానుకూల వైఖరితో ఉన్న బీజేపీ తాజాగా మనసు మార్చుకుందా అన్న చర్చ సాగుతోంది. నిన్న బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళల గురించి చేసిన కామెంట్ వివాదాస్పదం కావడమే ఇందుకు కారణం. ఉద్యమంలో పాల్గొంటున్న కొందరు మహిళలు 50 వేల రూపాయల చీరలు కట్టుకుని కనిపిస్తున్నారంటూ విష్ణు చేసిన వ్యాఖ్యలు జేఏసీ నేతల్లో మంటపుట్టించాయి. వాస్తవానికి ఆయన జేఏసీలో ఉన్న కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ గురించి వ్యాఖ్యానించగా.. ఆమె దీనిపై ఫైర్ అయ్యారు. ఆమెకు మద్దతుగా మిగతా మహిళా నేతలు కూడా విరుచుకుపడుతున్నారు. దీంతో అమరావతి ఉద్యమకారుల చీరల గురించి మీకెందుకంటూ విష్ణును ప్రశ్నిస్తున్నారు.
Recommended Video
విమర్శలతో హీటెక్కిన అమరావతి..
ఓవైపు రాజధాని కోసం నెలల తరబడి ఉద్యమాలు చేస్తున్న రాజధాని రైతులు, మహిళలు, మరోవైపు వైసీపీ అండ ఉన్న దళిత, బహుజన ఉద్యమం, ఇంకోవైపు బీజేపీ నేత విష్ణు కామెంట్లు.. ఇలా అన్నీ కలిసి ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో అమరావతి ఉద్యమం మరోసారి హీటెక్కింది. ఇన్నాళ్లు అమరావతి ఉద్యమాన్ని పట్టించుకోని వైసీపీ, బీజేపీ ఇప్పుడు ఎందుకు రంగంలోకి దిగాయన్న చర్చ కూడా సాగుతోంది. మూడు రాజధానుల వ్యవహారం చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఎవరి సత్తా ఏంటో తేల్చుకునేందుకే అందరూ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్ధానికంగా చర్చ జరుగుతోంది. అందుకే ఇక్కడ ఎవరూ వెనక్కి తగ్దేందుకు ఇష్టపడటం లేదు.