చంద్రబాబు గణిత మేధావి, లోకేష్ బాలమేధావి.. అమరావతి కథ , స్క్రీన్ ప్లే బాబుదేనట !!
రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ ఉద్యమం నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే రాజధానిగా అమరావతి వద్దు, మూడు రాజధానులు ముద్దు అంటూ అమరావతి లోనే మరో ఉద్యమం కొనసాగుతోంది. రాజధానిగా అమరావతి ఉంచాలంటూ, అమరావతి రైతులకు బాసటగా చంద్రబాబు మొదటి నుండి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రాజధాని అమరావతి రైతులకు బేడీలు వేయడం పై టిడిపి గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి పిలుపునివ్వడం, అది అనేక ఉద్రిక్తతలకు దారి తీయడం తెలిసిందే. ఇక దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుపై, అమరావతి ఉద్యమం పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
రాజధాని అమరావతిలో ఉద్యమానికి కథ, స్క్రీన్ ప్లే అంతా చంద్రబాబుదే
రాజధాని అమరావతిలో ఉద్యమానికి కథ, స్క్రీన్ ప్లే అంతా చంద్రబాబుదేనని, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల వ్యతిరేక ఉద్యమంగా రాష్ట్ర ప్రజలు దీనిని భావిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. రాజధానిలో బినామీల ఆస్తులను కాపాడటం కోసమే చంద్రబాబు ఉద్యమాలు చేయిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న ఆందోళనలు, ఆయన ఇస్తున్న ఆందోళనలకు పిలుపులు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి అని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టంచేశారు.
టిడ్కో ఇళ్ల విషయంలో చంద్రబాబు డెడ్ లైన్లు పెట్టటం ఆశ్చర్యం
సంక్రాంతి లోపల టిడ్కో ఇళ్లను నిర్మించకపోతే, ఇళ్లను లబ్ధిదారులకు అందించకుంటే.. ఆ ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయలేదని, అలాంటి చంద్రబాబు తమకు డెడ్ లైన్లు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మంత్రి కన్నబాబు. ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకారం నిరుపేదలకు భూములను రిజిస్ట్రేషన్ చేయించి వారికి ఇచ్చి, ఇళ్ల నిర్మాణాన్ని కూడా చేపడతామని మాట ఇచ్చారని ఆ మేరకే త్వరలో ఇస్తామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు
.
పోలవరానికి ఈ దుస్థితి చంద్రబాబు వల్లే ..
తెలుగుదేశం పార్టీ మొదటి నుండి రాష్ట్రంలోని అన్ని వనరులను తమ వ్యక్తిగత అవసరాల కోసమే వాడుకుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఏటీఎంలా వాడారని, ప్రస్తుతం పోలవరం పై తలెత్తిన ఇబ్బందులకు చంద్రబాబు ప్రధాన కారణమంటూ నిప్పులు చెరిగారు మంత్రి కన్నబాబు. రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రాజెక్టుకు నిధులు రాని దుస్థితి ప్రస్తుతం ఏర్పడడానికి చంద్రబాబే కారణమని విమర్శించారు. వరి చెరుకు చేపల చెరువు కి తేడా తెలియని లోకేష్ కూడా మాట్లాడే వాడేనా అంటూ ఎద్దేవా చేశారు మంత్రి కన్నబాబు.
చంద్రబాబు , లోకేష్ లు అలా ఫీల్ అవుతున్నారు
చంద్రబాబు గణిత మేధావి, కొడుకు లోకేష్ బాలమేధావి తరహాలో మాట్లాడుతున్నారు అంటూ విమర్శల వర్షం కురిపించారు. టిడిపి ప్రభుత్వం ఎగ్గొట్టిన ఇన్పుట్ సబ్సిడీని వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇస్తోందని కురసాల కన్నబాబు స్పష్టంచేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు, వరదలకు పంట నష్టపోయిన రైతులకు నవంబర్ నెలాఖరులోగా నష్టపరిహారం అందజేయాల్సిందిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు గా కన్నబాబు పేర్కొన్నారు.
అమరావతి ఉద్యమం చంద్రబాబు కోసమే
రైతులకు అందించే పంట నష్టపరిహారాల జాబితా , సంబంధిత వివరాలన్నీ కూడా పారదర్శకంగా గ్రామ సచివాలయాలలో,రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తామని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని విషయాల్లో ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ ఉంటే, ఏం చేయాలో అర్థం కాని చంద్రబాబు రోజుకో రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక అమరావతి ఉద్యమం కేవలం చంద్రబాబు కోసమే సాగుతుంది అంటూ మండిపడ్డారు కన్నబాబు .