3 రాజధానుల గెజిట్ నోటిఫికేషన్పై స్టే కోసం: పరిరక్షణ సమితి ఎంట్రీ: చివరి యత్నం: ఎప్పుడంటే?
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి మరో ప్రయత్నం మొదలైంది. న్యాయపరంగా మూడు రాజధానుల ఏర్పాటును నిలువరించడానికి అమరావతి ప్రాంత రైతులు తమవంతు ప్రయత్నాలను ఆరంభించారు. ఇందులో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి తరఫున ఏపీ హైకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు. గవర్నర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై స్టే ఇవ్వాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ మంగళవారం విచారణకు రానుంది.
Recommended Video
గాజువాకలో పవన్ కల్యాణ్ ఓటమి..అందుకే వైజాగ్పై పగ: 23 నుంచి సున్నాకు టీడీపీ: రోజా
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీని ఆధారంగా మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను జగన్ సర్కార్ వేగవంతం చేసింది. సచివాలయం సహా వివిధ శాఖాధిపతుల కార్యాలయాలను తరలించడానికి సన్నాహాలు చేపట్టబోతోంది.
ఇందులో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కొత్త పరిపాలనా రాజధానిగా ఆవిర్భవించబోతోన్న విశాఖపట్నంలో నిర్వహించడానికి సన్నాహాల కూడా ఆరంభించింది. ఈ పరిస్థితుల్లో అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎంట్రీ ఇచ్చారు. హైకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు. గవర్నర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను వెంటనే నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోరుతూ ధనేకుల రామారావు విజ్ఙప్తి చేశారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు వంటి ప్రయత్నాలన్నీ చట్టవిరుద్ధమని వారు తమ పిటీషన్లో పేర్కొన్నారు.
ఒకసారి అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత.. దాన్ని రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని రాజధానిగా గుర్తించిందని, ఈ మేరకు మ్యాప్లోనూ ఈ అంశాన్ని పొందుపరిచిందని స్పష్టం చేస్తున్నారు. ఈ పిటీషన్ను విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. మంగళవారం విచారణ చేపట్టబోతోంది. దీనితో ప్రస్తుతం అందరి కళ్లూ హైకోర్టు మీదే నిలిచాయి. హైకోర్టు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంది? ఆదేశాలను ఇస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.