కరోనా విజృంభణతో అమరావతి విలవిల.. ఆంక్షల వలయంతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరుగా వ్యాపిస్తోంది. కొన్ని జిల్లాల్లో అత్యధికంగానూ, మరికొన్ని జిల్లాల్లో అత్యల్పంగానూ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరోనా ఫ్రీగా ఉన్నాయి. మరోవైపు రాజధాని అమరావతిలో పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన పెరుగుతోంది.
కరోనా వలయంలో అమరావతి...
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. మిగతా జిల్లాలతో పోలిస్తే అమరావతి పరిధిలోకి వచ్చే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కరోనా కేసుల వ్యాప్తి అంచనాలకు మించిపోతోంది. ప్రభుత్వం తాజాగా ఉదయం ప్రకటించిన హెల్త్ బులిటెన్ ప్రకారం గుంటూరు జిల్లా 122 కేసులతో రాష్ట్రంలోనే అగ్రస్ధానంలో ఉండగా.. కృష్ణాజిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి. దీంతో కేవలం ఈ రెండు జిల్లాల్లోనే 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లయింది.
సీఎం క్యాంపు ఆఫీసు సమీపంలోనూ..
ఇప్పటివరకూ అమరావతి ప్రాంతంలో నమోదైన కేసులన్నీ గుంటూరు జిల్లాలో, అందునా గుంటూరు నగర పరిధిలోనే ఎక్కువగా నమోదవుతుండగా.. తాజాగా సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ఉన్న తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోనూ నిన్న ఓ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అమరావతి పరిధిలోని గ్రామాల్లోనూ అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం రాజదాని ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్ధితి నెలకొంది.
రాకపోకలపై పూర్తి నిషేధం..
అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ఇరు జిల్లాల మధ్య రాకపోకలను పూర్తిగా నిషేధించారు. నిన్నటి నుంచే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇదే క్రమంలో రాజధాని గ్రామాల మధ్య కూడా రాకపోకలను నియంత్రిస్తున్నారు. కొన్ని చోట్ల స్ధానికంగా గ్రామ ప్రజలే స్వీయ నియంత్రణ అమలు చేస్తుండగా.. మరికొన్ని చోట్ల పోలీసు ఆంక్షలతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానాలు..
రాజధాని ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంపై విపక్ష టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తాజాగా దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు... అమరావతిలో కేసుల సంఖ్య పెరగడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాజధానిలో కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందని ఆరోపిస్తున్న టీడీపీ.. అమరావతి ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ఇక్కడ కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు చేస్తోంది.