Nara Lokesh: పాకిస్తాన్ బోర్డర్లా గ్రామాలు: మహిళలను అరెస్టు చేయడం సిగ్గుగా లేదా?: నారా లోకేష్
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరింపజేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచింది. ఆయా సందర్భాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను మోహరింపజేసింది.
ఏదైనా జరిగితే.. బాధ్యత ఎవరిది?
రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసి, యుద్ధ వాతావరణాన్ని సృష్టించిందని ఆరోపించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే.. దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
వీడియోను పోస్ట్ చేసి..
పోలీసులు కవాతు నిర్వహిస్తోన్న ఓ వీడియోను నారా లోకేష్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతులు తలపెట్టిన నిరసన ప్రదర్శనలను భగ్నం చేయించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసిందని ఆరోపించారు. రాజధాని గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించిందని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలను గుర్తుకు తెస్తున్నాయని మండిపడ్దారు. పాకిస్తాన్ బోర్డర్లో కూడా ఇంతమంది పోలీసులు ఉండరని అన్నారు.
ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా?
ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో ప్రభుత్వం అస్థిరతను సృష్టించడానికి కుట్ర పన్నిందని నారా లోకేష్ విమర్శించారు. పోలీసులను మోహరింపజేసి అన్యాయంగా, క్రూరంగా రైతుల ఉద్యమాన్ని అణచివేస్తోందని అన్నారు. ప్రభుత్వం ఎంతగా అణిచివేయడానికి ప్రయత్నిస్తే.. అంతగా ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులను రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటోందని అన్నారు.
రైతులను అరెస్టు చేయడానికి సిగ్గులేదా?
అక్కాచెల్లీ అంటూ పాదయాత్రలో పలకరించారని, ఇప్పుడు అదే అక్కాచెల్లీ కంట కన్నీరు పెట్టి రోడ్డెక్కితే ఎందుకు పారిపోతున్నారని నిలదీశారు. రాజధాని గ్రామాల్లో ఒక్కో ఇంటి దగ్గర పది మంది పోలీసులను మోహరింపజేసి మరీ మహిళల్ని అరెస్ట్ చెయ్యడానికి జగన్కు సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. ఎంత మంది పోలీసులను దింపినా ప్రజాగ్రహానికి ప్రభుత్వం బలి కాక తప్పదని హెచ్చరించారు.