రాజధానిగా అమరావతినే ఉండాలని కోరుకుంటా ... కాకుంటే : వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులప్రకటన ఏపీలో రాజకీయ యుద్ధాలకు కారణం అయ్యింది. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి . ఇక వైసీపీ నేతలంతా సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి మాట్లాడుతుంటే, మూడు రాజధానులతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్తుంటే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రాజధానిగా అమరావతినే ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.
మూడు రాజధానుల విషయంలో అఖిలపక్ష భేటీకి సర్కార్ నిర్ణయం... రీజన్ ఇదే
మైలవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన అభివృద్ధి, సంక్షేమం తనకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లలాంటివని పేర్కొన్నారు. నియోజక వర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి తాము పని చేస్తున్నట్లు చెప్పుకున్న ఆయన కృష్ణా జిల్లా వాసిగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలనేదే నా కోరిక అని అన్నారు. తన కోరిక ఎలా ఉన్నా పార్టీ అధినేత జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. అందుకే మూడు రాజధానుల నిర్ణయానికి ఎదురు చెప్పలేదని పేర్కొన్నారు .
రాజకీయ నిరుద్యోగి అయిన దేవినేని ఉమాకు అమరావతి ఉద్యమం కోతికి కొబ్బరి కాయ దొరికిన చందంగా ఉందని అందుకే రైతుల కంటే ఎక్కువగా ఆయన పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని విషయంలో ఉమా చేస్తున్న ఆందోళనలపై వసంత కృష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ప్రతీ విషయాన్ని రాజకీయం చెయ్యాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు చాలా మందికి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఉన్నా జగన్ నిర్ణయం మేరకే సైలెంట్ గా ఉన్నారని మైలవరం ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అర్ధం అవుతుంది .