అమరావతి పోరు ..55 వ రోజు .. 70కి పైగా దేశాల ఎన్ఆర్ఐల మద్దతు ..151 గంటల రైతుల దీక్షలు భగ్నం
అమరావతి రైతుల ఆందోళన రోజు రోజుకూ ఉధృతమవుతోంది. 54 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తూ 55 వ రోజు కూడా అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిని తరలించవద్దంటూ రైతులుమందడం, తుళ్లూరులో ధర్నాలు చేపట్టారు. వెలగపూడిలో రిలే దీక్షలు 55వ రోజుకు చేరాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు 24గంటల పాటు దీక్షలో కూర్చోనున్నారు.
తెలంగాణా క్యాబినెట్ మంత్రిగా కవిత ? .. మళ్ళీ కేసీఆర్ తనయపై గులాబీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ
వెలగపూడి యువ రైతుల దీక్ష భగ్నం
రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలకు తమ నిరసన తెలపాలన్న లక్ష్యంతో వెలగపూడి శిబిరంలో యువ రైతులు శ్రీకర్, రవిచందర్లు 151 గంటల పాటు నిరాహార దీక్షకు దిగారు. యువరైతులకు రాజధాని గ్రామాల ప్రజల నుండి మద్దతు లభించింది. పెదపరిమి నుంచి పెద్ద ఎత్తున యువత, మహిళలు, రైతులు ర్యాలీగా వచ్చి వారికి సంఘీభావం తెలిపారు. దీంతో వీళ్ల దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తామన్న యువ రైతులు
వీరి దీక్ష ఆదివారం అర్ధ రాత్రి వరకు 112 పాటు దీక్ష చేసిన వీరి ఆరోగ్య పరిస్థితి క్షిణిస్తోందని, షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని వైద్యులు చెప్పడంతో వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే యువ రైతులు ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తామని తేల్చి చెప్పారు . రాజధానిగా అమరావతినే కొనసాగాలని డిమాండ్ చేశారు . ఇక రాజధాని రైతుల పోరాటానికి ప్రవాసాంధ్రుల నుండి మద్దతు లభిస్తుంది.
అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చెయ్యాలని నిర్ణయించిన ఎన్ఆర్ఐ జేఏసీ
ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ నేపథ్యంలో రాజధాని అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఎన్ఆర్ఐ జేఏసీ నిర్ణయించింది. అమెరికాలో తెలుగువారుండే ప్రాంతాల నుంచి ప్రధానికి నరేంద్రమోదీకి వినతి పత్రాలు పంపించాలని నిర్ణయించినట్లు ఎన్ఆర్ఐ జేఏసీ ప్రకటించింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేసింది. అమెరికాలోని రాష్ట్రాల రాయబార కేంద్రాలు, తెలుగువారు ఉన్న 70కి పైగా దేశాల నుంచి ప్రధాని నరేంద్రమోదీకి వినతిపత్రాలు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
విద్యార్థులు, రైతులపై కేసులు ఎత్తివెయ్యాలని ఎన్ఆర్ఐ జేఏసీ డిమాండ్
ఫిబ్రవరి నెలాఖరు నాటికి విద్యార్థులు, రైతులపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఎన్ఆర్ఐ జేఏసీ డిమాండ్ చేసింది. కేసులు ఎత్తివేయకపోతే వినతి పత్రాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. రాజధానిగా అమరావతికి రాజధాని రైతుల పోరాటానికి బాసటగా ఉంటామని ఎన్ఆర్ఐ జేఏసీ వెల్లడించింది . మరో వైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా రైతులు వెనుకడుగు వేయడం లేదు. తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.