అమరావతిలో అవినీతి ఆగింది .. పనులు కాదు... ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్
అమరావతి : ఏపీ రాజధాని అమరావతి చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. రాజధాని మారుస్తారనే ఊహాగానాల నేపథ్యంలో టీడీపీ నేతలు .. అధికార వైసీపీపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. అమరావతిలో పనులు ఆగలేదని స్పష్టంచేశారు. అవినీతిని మాత్రం కూకటివేళ్లతో నిర్మూలించామని తేల్చిచెప్పారు.
ఏపీలో అవినీతి రహిత పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన పాలన అవినీతికి నిలువుటద్దం అని విమర్శించారు. ఆయన సోమవారం విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. అక్షరాస్యతలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో నిలువాలన్నది సీఎం జగన్ ఆకాంక్ష అని .. అందుకు అనుగుణంగా అందరం కలిసి శ్రమిద్దామని కోరారు.
రాష్ట్రంలోని మహిళల ఆనందం నింపేందుకు మద్యపాన నిషేధం అమలు జరగనుందని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఇళ్ల పేరుతో టీడీపీ నేతలు పేదలను దోచుకున్నారని గుర్తుచేశారు. కానీ పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదీ సీఎం జగన్ లక్ష్యమని స్పష్టంచేశారు. అర్హులందరికీ పారదర్శకంగా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తేల్చిచెప్పారు.