తలెత్తుకుని తిరగలేకపోతున్నాం: మంత్రుల సమక్షంలో వైసీపీ నేతలు: అసంతృప్తితోనే..!
అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలించాలనే ప్రభుత్వం నిర్ణయం వారికి రుచింటం లేదు. తాము గెలిచిన పార్టీ..నమ్ముకున్న నేత..అధికారంలోకి ఉన్న వేళ..దీంతో..తమ మనసులోని ఆవేదనను చెప్పీ చెప్పనట్లుగా..మద్దతిచ్చీ..ఇవ్వనట్లుగా.. రాజధాని ప్రాంత వైసీపీ నేతలు మంత్రుల ముందు ఎట్టకేలకు తమ ఆవేదన బయట పెట్టారు. రాజధాని తరలింపు పైన ప్రత్యేకంగా రాజధాని ప్రాంతం ఉన్న రెండు జిల్లా ల ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతోందని..వారి ముందు తలెత్తుకొని తిరగలేకపోతున్నామంటూ వాపోయినట్లు సమాచారం.
అమరావతిలో రైతుల సమస్య పరిష్కరిస్తామని..దీని కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పా టు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అయినా..అయిష్టంగానే..వారి మాటలతో పూర్తి సంతృప్తి చెందకుండానే..బయటకు వచ్చిన ఆ ప్రాంత నేతలు..తాము ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని.. రైతుల సమస్యలు పరిష్కరిస్తుందంటూ ధీమాగా చెప్పే ప్రయత్నం చేసారు.
ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది...
పరిపాలనా రాజధాని అమారవతి నుండి విశాఖకు తరలించాలనే ప్రతిపాదనతోనే తాము నియోజకవర్గాల్లో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఉందని..ఇక, నిర్ణయం అమలు జరిగితే తాము ఇబ్బందుల్లో పడతామని రాజధాని ప్రాంతంలోని రెండు జిల్లాల ఎమ్మెల్యేలు..అధికార పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వారు రెండు జిల్లాలకు చెందిన మంత్రులు..ఇన్ ఛార్జ్ మంత్రులతో సమావేశమయ్యారు. రెండు జిల్లాల్లోనూ ప్రజల్లో అంతర్గతంగా ఆందోళన ఉందని..నిరసన కనిపిస్తోంది వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఆ సమయంలో మంత్రులు వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు. ఖర్చంతా ఇక్కడే పెడితే మిగతా ప్రాంతాల మాటేంటని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు హాయంలో ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఓటమి పాలయ్యారంటూ వారు అమరావతి ప్రాంత వైసీపీ నేతలకు వివరించినట్లుగా తెలుస్తోంది.
రైతుల విషయంలో స్పష్టత ఇవ్వండి..
అమరావతి నుండి రాజధాని తరలించే ముందే ఈ ప్రాంతానికి ఏం చేయాలనే ఆలోచనతో ఉన్నదీ స్పష్టత ఇవ్వాలని ఆ ప్రాంత నేతలు కోరినట్లుగా తెలుస్తోంది. రాజధాని నగర ప్రాంత రైతులకు సంపూర్ణ న్యాయం చేయాలని .. అదే సమయంలో అమరావతి ప్రాంతాన్ని పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఇతర వాణిజ్య సముదాయాలతో అభివృద్ధి చేయాలని వారు అభ్యర్ధించినట్లు సమాచారం. మూడు రాజధానుల వ్యవహారంలో ఎమ్మెల్యేలుగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వైసీపీ ప్రజాప్రతినిధులు మంత్రులకు వివరించారు. పరిశ్రమలకు పెద్దఎత్తున రాయితీలివ్వాలని, లేదంటే అవి అమరావతికి రావన్నారు. విశాఖతో సమాంతరంగా అమరావతిని అభివృద్ధి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విశాఖతో సమాంతరంగా అమరావతిని అభివృద్ధి చేయాల్సిందేనని పట్టుబట్టారు.
అసంతృప్తితోనే...సమర్ధించుకోలేక
అమరావతి రైతుల సమస్యల పైన మంత్రివర్గ ఉపసంఘం వేస్తామని..వారితో చర్చించి వారికి ఏం చేయాలో నిర్ణయిస్తామని మంత్రులు నచ్చ చెప్పారు. దీనికి రాజధాని ప్రాంత వైసీపీ నేతలు మాత్రం అయిష్టం గానే మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. ముందుగానే రైతులకు ఏం చేయనున్నారో స్పష్టత ఇచ్చి..అప్పుడు అధికారికంగా నిర్ణయం తీసుకోవటం ద్వారా ఆందోళన తగ్గుతుందని సూచించారు. అయితే, దీని పైన తాము ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామంటూ మంత్రులు గట్టిగా చెప్పటంతో..రాజధాని ప్రాంత వైసీపీ నేతలు అసంతృప్తితోనే బయటకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక, బయట మాత్రం మంత్రుల మాటలనే చెప్పుకొచ్చారు. రైతులకు నష్టం లేకుండా.. అమరావతి ప్రాంతంలో అభివృద్ధి దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించలేక..అదే సమయంలో వ్యతిరేకించలేక..రాజధాని ప్రాంత వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.