'బీజేపీ డ్రామాలను వర్ణించలేం', 'బీజేపీపై చేసిన దాడులకు బాబు మద్దతు ఉంది'
అమరావతి: బీజేపీపై మంత్రి అమర్నాథ్ రెడ్డి గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ డ్రామాలు మాటల్లో వర్ణించలేమన్నారు. అన్నాడీఎంకే పార్టీ అండతో పార్లమెంటు సమావేశాలను బీజేపీ అడ్డుకుందన్నారు. బీజేపీ వైఫల్యాలను ప్రతిపక్షాలపై నెట్టడం మోడీకి అలవాటుగా మారిందన్నారు. బీజేపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు.
ఏపీ చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడం వల్లే తమ పార్టీపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఆరోపించారు. బీజేపీ పార్టీపై సీపీఐ చేసిన దాడిని హరిబాబు ఖండించారు.
బీజేపీపై జరిగిన దాడి అప్రజాస్వామికం అన్నారు. కమ్యూనిస్టుల ఫాసిస్ట్ ఆలోచనలకు నిదర్శనం అన్నారు. ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీ కార్యక్రమంపై దాడి చేయడం విశాఖలో కొత్త విధానం, సంస్కృతిగా మారిందన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బీజేపీపై చేసిన దాడులకు మద్దతు ప్రకటించారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు మద్దతు కమ్యూనిస్టులకు నైతిక బలమిచ్చి ఉంటుందన్నారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్నారు. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏ నిర్వీర్యమైన ప్రభుత్వం ఉందో, రాబోయే రోజుల్లోను అలాంటి నిర్వీర్యమైన ప్రభుత్వమే వస్తుందన్నారు.