హైకోర్టు తరలింపును అడ్డుకోం..సచివాలయాన్ని కదలినవ్వం: జగన్ అనుభవరాహిత్యం శాపం: కన్నా
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి తమ వైఖరేమిటో స్పష్టం చేశారు. కర్నూలుకు హైకోర్టును తరలించడాన్ని తాము అడ్డుకోలేమని, అదే సమయంలో విశాఖపట్నంలో సచివాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రతిఘటిస్తామని చెప్పారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చాలనుకోవడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు.
కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని కుదురుకోవడానికి కొంత సమయాన్ని ఇస్తాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్నందున ఒక్కరోజు కూడా గడువు ఇవ్వకూడదని తాము భావిస్తున్నామని అన్నారు. ప్రభుత్వానిక ఒక్కరోజు గడువు ఇచ్చినా.. అరాచక పాలనను ప్రోత్సహించినట్టవుతుందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
వైఎస్ జగన్ అనుభవ రాహిత్యం రాష్ట్రానికి శాపంలా మారిందని ఆరోపించారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే ప్రజా వ్యతిరేకతను బాగా మూటగట్టుకున్నారని చెప్పారు. రాజకీయ దురద్దేశంతోనే మూడు రాజధానుల ప్రకటన చేశారని మండిపడ్డారు. రాజధానిగా అమరావతిని కొనసాగించడానికే తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే అధికార పార్టీకి 23 సీట్లు కూడా రావని అన్నారు.
రాజధాని పేరుతో తమ భూములు కబ్జా చేస్తారనే భయంతో విశాఖ ప్రజలు హడలి పోతున్నారని అన్నారు. రాయలసీమ గూండాయిజం, అక్కడి ఫ్యాక్షన్ సంస్కృతి విశాఖపట్నంలో పెరిగిపోతుందనే భయాందోళనలు విశాఖవాసుల్లో వ్యక్తమౌతున్నాయని, అందుకే వారు పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడాన్ని అంగీకరించట్లేదని చెప్పారు. రాష్ట్రంలో పోలీసుల పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై గొంతెత్తిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, రాజకీయ కక్ష సాధింపులకు ప్రభుత్వం దిగుతోందని అన్నారు. నవరత్నాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు.