తెగ ఆకర్షిస్తోంది..!: అమరావతిలో 153 ఏళ్ల కిందట నిర్మించిన బావి
అమరావతి: ఏ ముహుర్తాన చంద్రబాబు నాయుడు ఏపీ రాజధానిని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో నిర్మించాలని ప్రకటించారో తెలియదు గానీ, ఇప్పుడు ఆయా గ్రామాల్లోని విశేషాలను మాత్రం మీడియా హైలెట్గా చూపిస్తోంది. తాజాగా నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతంలోని మల్లాది గ్రామంలోని ఓ బావిపై మీడియా దృష్టి పడింది.
సుమారు 154 ఏళ్ల కిందట (1863లో) కేవలం రాయిపై రాయిని పేర్చి అద్భుతంగా నిర్మించిన ఈ బావి చూస్తే ఔరా అనాల్సిందే. అమరావతికు సమీపంలోని మల్లాది అనే గ్రామంలో నిర్మించిన ఈ బావిని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే ఇప్పటి ఇంజనీర్లు వివిధ అంతస్తుల్లో భవంతులను నిర్మిస్తున్నారు.
అందుకోసం అత్యాధునిక యంత్రాలు, సిమెంట్ మిశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. అయినా సరే అనుకున్న సమయానికి కట్టడాల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. కానీ ఆనాటి కాలంలో నిర్మించి ఈ బావి అద్భుత నిర్మాణం అందరినీ తెగ ఆకర్షిస్తోంది. అమరావతికి సమీపంలోని మల్లాది గ్రామంలో ఉన్న బావి పేరు బత్తినేని వారి బావి.
ప్రస్తుతం ఈ బావి పూడికతీత పనులు జరుగుతున్నాయి. బావిలోని నీటిని మొత్తాన్ని ఇంజన్లతో బయటకు తోడేయడంతో అత్యంత అద్భుతమైన ఈ రాతి కట్టడం బయటపడింది. 1863లో పొలం పనులకు వెళ్లే రైతులు, రైతు కూలీలు, పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామంలో చుక్కనీరు దొరకని పక్షంలో బత్తినేని రామయ్య అనే దాత 80 అడుగుల లోతున ఈ అద్భుత జలసౌధాన్ని అప్పట్లోనే నిర్మించాడు.
తొలుతు బావిని ఎంత లోతు తవ్వినా నీళ్లు పడకపోవడంతో ప్రధాన బావిలో మళ్లీ చిన్న బావి తవ్వంచి పాతాళ గంగను పైకి రప్పంచిడంలో సఫళీకృతడయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బావి అన్నదాతల దాహార్తిని తీర్చడంతో పాటు పురుగు మందుల పిచికారీ కోసం నీరు తోడుకునేందుకు, మిరప, ప్రత్తి మొక్కలు నాటుకోవడం వంటి పనులకు ఉపయోగపడుతోంది.
ఈ బావికి 1983లో తొలిసారిగా పూడిక తీయించిన రామయ్య వారసులు, తిరిగి ప్రస్తుతం పూడిక తీయిస్తున్నారు. తమ వెనుకటి పెద్దలు చేయించిన ధార్మిక కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగేలా ఉదారత చూపుతున్నారు. అలనాటి అమరావతి ప్రాశస్త్యాన్ని ఈ బత్తినేని బావి కూడా ప్రదర్శిస్తూనే ఉంది.