బాబు, వెంకయ్య కోసమే భూసేకరణ: ఆళ్ల, హజారేను కలిసిన అంబటి రాంబాబు
గుంటూరు: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపి సిఎం చంద్రబాబు నాయుడుల కోసమే భూసేకరణ ఆర్డినెన్స్ను తెరపైకి తెచ్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న భూసేకరణ ఆర్డినెన్స్ను తెలుగుదేశం పార్టీ సమర్ధిస్తుందా? లేక వ్యతిరేకిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు.
భూసేకరణ ఆర్డినెన్స్పై టిడిపి తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అన్ని ప్రతిపక్ష పార్టీల సభ నుంచి వాకౌట్ చేసినా టిడిపి ఎంపీలు మాత్రం సభలోనే ఉన్నారని రామకృష్ణా రెడ్డి అన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్ను మేధావులు వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు.
కొంతమంది నాయకుల స్వార్ధపూరిత ప్రయోజనాల కోసమే బిజెపి ప్రభుత్వం హడావిడిగా ఈ ఆర్డినెన్స్ను తెచ్చిందన్నారు. ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తూ రైతులు ఇచ్చే 9.2 ఫారాల గడువును పొడగించాలన్నారు. భూసేకరణకు సంబంధించి 9.3 ఫారాలు ఇచ్చిన రైతులు కూడా పునరాలోచనలో పడ్డారని రామకృష్ణా రెడ్డి తెలిపారు.
రియల్ ఏస్టేట్ కోసమే భూములు: అంబటి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు అన్యాయం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. సారవంతమైన భూములను ఏకపక్షంగా లాక్కొని రైతులకు అన్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.
మంగళవారం ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారేను అంబటి రాంబాబు, ఏపీ రాజధాని ప్రాంత రైతు నేతలు కలిశారు. అన్నా హజారే దీక్ష వద్ద రాజధాని కౌలు పంటల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు అంబటి తెలిపారు.
మార్చి మొదటి వారంలో ప్రముఖ సంఘ సంస్కర్త మేధా పాట్కర్ కూడా ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ రాజధానికి రెండు వేల ఎకరాలు సరిపోయే పక్షంలో, మిగిలిన భూమిని రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించనున్నారా?అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.