కిరణ్ రెడ్డి కోట్లు వెనకేశాడు, సిక్స్ అని డకౌట్: అంబటి
అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా సమైక్య సింహం ముసుగు తొలగిందని అంబటి అన్నారు. రాష్ట్ర విభజనకు ముఖ్య కారణకుడు కిరణ్ కుమార్ రెడ్డేనని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత స్వార్థం కోసం తెలుగు ప్రజలను మోసం చేశాడని కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు.
ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు నీతి, నిజాయితీలనేవే లేవని ఆరోపించారు. అవే ఉంటే రాజకీయాలకు స్వస్తి పలకాలని చంద్రబాబు నాయకుడు అంబటి సూచించారు. లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు ఒకరికొకరు సహకరించుకున్నారని విమర్శించారు.
సిక్స్ కొడతానని డకౌటయ్యారు: సిఎంపై బాలినేని
రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు ప్రజలను మోసం చేశాడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ ఉపనేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చివరి బంతికి సిక్స్ కొడతానని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యారని విమర్శించారు.
రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తవుతున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం వల్ల ఓరిగేదేమి లేదని బాలినేని శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజనపై నిర్ణయం తీసుకున్నప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసివుంటే విభజన జరిగివుండేది కాదని చెప్పారు. ఇప్పుడు రాజీనామా పేరుతో కిరణ్ కుమార్ రెడ్డి నాటకాలాడుతున్నారని ఆరోపించారు.