జగన్ చెప్పిందే నిజమైంది, చంద్రబాబు బెస్ట్ ఈవెంట్ మేనేజర్: అంబటి
హైదరాబాద్: అమరావతి శంకుస్థాపన విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్ చెప్పిందే నిజమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. ప్రజల సొమ్ముతో అమరావతి శంకుస్థాపన అంగరంగ వైభవంగా చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెస్ట్ ఈవెంట్ మేనేజర్ అని నిరూపించుకున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
చంద్రబాబును పరిపాలనా దక్షుడు అని అంటారని, కానీ అమరావతి శంకుస్థాపన తీరు చూస్తే ప్రజల సొమ్ము ఖర్చు చేసి కార్యక్రమాలు నిర్వహించడంలో మంచి ఈవెంట్ మేనేజర్ అని తేలిందని ఆయన అన్నారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీ చేత చంద్రబాబు ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించడంలో విఫలమయ్యారని ఆయన విమర్సించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ప్రజలను మోసం చేయడం కాదా అని ఆయన అడిగారు.
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని శ్రీశ్రీకి చాలా ఇష్టమైన గురజాడ అప్పారావు అన్నారని ఆయన గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అంటే మనుషులని, రాజధాని అంటే మనుషులని ఆయన అన్నారు. ఎపి అంటే రైతులు, శ్రామికులు, కూలీలు అనీ మట్టి కాదని ఆయన అన్నారు. రాజధాని అంటే గుప్పెడు మంట్టి, 33 వేల ఎకరాలు అని చెప్పడం దారుణమైన విషయం, అవమానించే విషయమని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పారని, ఇప్పుడు అందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ఆయన అంబటి రాంబాబు అన్నారు. మనుషులను హింసించి రాజధానిని నిర్మించడం సరి కాదని ఆయన అన్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు అమరావతి శంకుస్థాపన ఆర్భాటంగా చేశారని ఆయన అన్నారు. పంచెలు వేసుకుని కూర్చున్న రైతుల గురించి అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఎవరైనా మాట్లాడారా అని ఆయన అడిగారు. రాష్ట్రమంటే అహంభావంతో నడిచిపోతుందని చంద్రబాబు అనుకుంటున్నారని ఆయన అన్నారు.
అపాయింట్మెంట్ అడిగితే ప్రధాని మోడీ తనకు ఇవ్వలేదని, ప్రత్యేక హోదాపై అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రకటిస్తారని అనుకున్నామని, తమకు అపాయింట్మెంట్ ఇస్తే క్రెడిట్ తమకు పోతుందనే ఉద్దేశంతోనే ఇవ్వలేదని అనుకున్నామని, కానీ ప్రధాని మోడీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేయలేదని ఆయన అన్నారు.
చంద్రబాబులో విషయం తక్కువ ఆర్భాటం ఎక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాపాలకు పవిత్రత ఆపాదించేందుకే అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకునే పరిపాలనా దక్షుడిగా చంద్రబాబు కాలేకపోతున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మోడీని ఎందుకు ఒప్పించలేకపోతున్నారని ఆయన అడిగారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం తాము త్వరలోనే భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.