పొలిటికల్ హీట్ పెంచిన నిమ్మగడ్డ లేఖ..! భగ్గుమన్న వైసీపీ.. ఇంతకీ లేఖ రాసినట్టా.. లేదా
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కు వైసీపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. చంద్రబాబుకు సన్నిహితుడైన రమేష్ ఆయన ప్రయోజనాల మేరకే కుట్రపూరితంగా ఎన్నికలను రద్దు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది.
మొత్తానికి ఎన్నికల నిర్వహణపై ఈసీదే తుది నిర్ణయమని.. అయితే ఎన్నికల కోడ్ను ఎత్తివేయాలని సూచించింది. ఇదే క్రమంలో నిమ్మగడ్డ ప్రసాద్.. తనకు ప్రాణహాని ఉందంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతలోనే ఆ లేఖ అవాస్తవమని నిమ్మగడ్డ రమేష్ ట్విస్ట్ ఇచ్చారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అంబటి ఏమన్నారు..
కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను వాయిదా వేశామని చెబుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్.. కరోనా వైరస్ గురించి కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా కేంద్రానికి లేఖ రాశారని అంబటి ఆరోపించారు. చంద్రబాబు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆరోపణలనే లేఖలో పేర్కొన్నారని మండిపడ్డారు. ఈ లేఖను టీడీపీ కార్యాలయం నుంచి ఐదు టీవీ చానల్స్ ప్రతినిధులకు పంపించారన్నారు. ఎవరెవరికి ఈ లేఖలు అందాయో తమకు తెలుసన్నారు.
నిమ్మగడ్డ స్పందించాలని అంబటి డిమాండ్
నిమ్మగడ్డ రమేష్ తన ఈ-మెయిల్ నుంచే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖను పంపించారని అంబటి అన్నారు. ఈ లేఖ వాస్తవమా? కాదా? అనేది నిమ్మగడ్డ రమేషే చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా లేఖ సర్క్యులేట్ అవుతోందని.. అది వాస్తవమా? కాదా? అని చెప్పే బాధ్యత నిమ్మగడ్డ రమేష్కు లేదా అని సూటిగా ప్రశ్నించారు. ఈ లేఖను చూస్తుంటే ప్రభుత్వంపై బురదజల్లాలనే కుట్రకు
నిమ్మగడ్డ రమేష్ వత్తాసు పలుకుతున్నారనే భావన కలుగుతోందన్నారు. కాబట్టి వెంటనే దీనిపై వివరణ ఇచ్చి దుష్ప్రచారాలకు చెక్ పెట్టాలన్నారు.
చంద్రబాబుపై ఫైర్
ప్రభుత్వంపై చంద్రబాబు ఉన్మాద భాష ఉపయోగిస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఎన్నికలు వాయిదా వేసే ముందు ప్రభుత్వంతో ఎందుకు సంప్రదించలేదని సుప్రీం కోర్టు ఈసీని ప్రశ్నించిందన్నారు. కానీ చంద్రబాబు సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని స్తంభింపజేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
Recommended Video
ఆ లేఖ ఫేక్ అని క్లారిటీ ఇచ్చిన నిమ్మగడ్డ
మరోవైపు స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంశాఖకు తాను లేఖ రాసినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని నిమ్మగడ్డ ఖండించారు. తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న లేఖ అవాస్తవమన్నారు. ఆ లేఖ అవాస్తవమని మీడియాకు వివరణ ఇచ్చారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. మొత్తం మీద నిమ్మగడ్డ లేఖ ఏపీ రాజకీయాల్లో పెద్ద కలకలమే రేపింది. ప్రభుత్వంతో తనకు,తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని.. కాబట్టి హైదరాబాద్లో ఉండేందుకు తనకు అనుమతినివ్వాలని అందులో పేర్కొన్నారు. తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని చెప్పారు. అయితే ఈ లేఖ ఫేక్ అని నిమ్మగడ్డ తేల్చేయడం పొలిటికల్ హీట్ను కాస్త తగ్గించవచ్చు.