బాబు ఆదేశాలతోనే భారతిని లాగారు, రూ.43వేలకోట్లు కాదు, 1200 కోట్లే: అంబటి ట్విస్ట్
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిపై కేసు నమోదు చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆదివారం ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీతో తాము లాలూచీ ఉంటే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.
నా భార్యనూ కోర్టులకు తిప్పుతారా, ఈడీలో ఆ ఇద్దరికి బాబుతో సంబంధాలు: జగన్ సంచలనం, ప్రశ్నల వర్షం
న్యాయ వ్యవస్థ బలమైనదని చెబుతారని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి బెయిల్ తెచ్చుకున్నామని చెబుతారని, ఇదేలా సాధ్యమని ప్రశ్నించారు. టీడీపీ తీరు భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. జగన్ రూ.43. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.
ట్విస్ట్.. జగన్ కేసులో రూ.1200 కోట్లపై మాత్రమే విచారణ
జగన్ కేసులో రూ.1200 కోట్లపై మాత్రమే విచారణ జరుగుతోందని అంబటి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు రూ.43వేల కోట్లు దోచుకున్నారని, లక్ష కోట్ల రూపాయలు అనధికారికంగా ఉన్నాయని, వేలాది కోట్ల రూపాయలపై విచారణ జరుగుతోందనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు అంబటి మాత్రం కేవలం రూ.1200 కోట్ల పైనే విచారణ జరుగుతోందని చెప్పడం గమనార్హం.
మంత్రికి సిగ్గుందా?
2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, పార్టీ మారి మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని అంబటి విమర్శించారు. యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రి కాదని, అబద్దాల శాఖ మంత్రి అన్నారు. తుని ఘటనలో ఇప్పటికీ దోషులను ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. మా పార్టీ గుర్తుపై గెలిచి, మా పార్టీనే విమర్శించేందుకు ఆదికి సిగ్గు ఉందా అన్నారు. తుని రైలును వైసీపీ గూండాలు తగులబెట్టారంటున్న యనమలకు సిగ్గుందా అన్నారు. అధికారం మీదేనని, విచారణ ఎందుకు ముందుకు సాగటం లేదన్నారు.
భారతిపై.. అంతా కుట్ర
భారతి మీద ఈడీ కేసు పెట్టారని, ముద్దాయిగా చూపారని, ఆ రెండింటిని పత్రికల్లో వార్త ప్రచురించారని అంబటి గుర్తు చేశారు. ఓ వర్గం మీడియాలో భారతిపై వచ్చిన వార్తలపై జగన్ బహిరంగ లేఖ రాశారని చెప్పారు. టీడీపీ నేతలు కళా వెంకట్రావు, మంత్రులు విమర్శలు చేశారని, ఇదంతా కుట్ర అని, జగన్, వైయస్ కుటుంబాన్ని అపహాస్యం చేయడానికి కొన్ని శక్తులు పని చేస్తున్నాయన్నారు. వైయస్ మృతి తర్వాత ఆయన కుటుంబాన్ని ఇబ్బందిపాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
జగన్కు వస్తున్న ఆదరణ చూడలేక భారతిని కూడా లాగారు
కాంగ్రెస్, టీడీపీ రెండూ కలిసి కేసులు వేసి అన్యాయంగా జగన్ను వేధిస్తున్నాయని వాపోయారు. ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా జగన్కు వస్తున్న ఆదరణ చూడలేక చివరకు భారతిని కూడా కోర్టుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందన్నారు. జగన్ బీజేపీతో కుమ్మక్కు అయితే ఈడీ కేసు ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు.
నాడు లక్ష కోట్లు అని, నేడు రూ.43వేల కోట్లు, సవాల్
టీడీపీ నేతలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా అని అంబటి ప్రశ్నించారు. జగన్ పైన కేసులు పెట్టి జైల్లో పెడితే గెలవొచ్చునని చంద్రబాబు తాపత్రయం అన్నారు. లక్ష కోట్లు అని ఇప్పుడు రూ.43వేల కోట్లు అంటున్నారని, అంతచూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. చంద్రబాబు, ఈడీ అధికారుల కాల్ డేటా బయటపెట్టాలన్నారు. కొందరు చంద్రబాబు పెట్టే గట్టి తింటున్నారని మండిపడ్డారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాడు
జగన్ జైల్లో ఉంటే పార్టీ పని అయిపోయిందనుకున్నారని, కానీ నిలబడేసరికి ఇలా తప్పుడు కుట్రలు చేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు, కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి మేం సిద్ధమన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికితే తప్పు కాదా అన్నారు. చంద్రబాబులా వ్యవస్థలను మేనేజ్ చేయడం తమకు రాదన్నారు. హెరిటేజ్లో జీతాలు ఎంత తీసుకుంటున్నారో లెక్కలు బయటపెట్టాలని చంద్రబాబు కుటుంబాన్ని డిమాండ్ చేశారు.