బాబుని బీజేపీ లాగి కొట్టింది, ఐనా సిగ్గులేదు: లక్షకోట్ల లెక్క అడిగిన అంబటి
గుంటూరు: ఏపీ రాజధాని విజయవాడ నడి రోడ్డు పైన ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పి, బీజేపీ ఏపీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెంప పైన లాగి కొట్టిందని, ఇంకా సిగ్గులేకుండా ఆయన కేంద్రంలో ఎలా కొనసాగుతారని వైసిపి నేత అంబటి రాంబాబు శుక్రవారం మండిపడ్డారు.
బీజేపీ నేతలు అలా మాట్లాడాక కూడా చంద్రబాబు కేంద్రంలో ఎలా కొనసాగుతున్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. రూ.1లక్షా 43వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసినట్లు ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారని, ఆ డబ్బులన్నీ ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు.
రూ.1లక్షా 43వేల కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని నిలదీశారు. తాము ఓ అవసరం నిమిత్తం నిధులు పంపిస్తే, ఏపీ ప్రభుత్వం మరో దానికి ఉపయోగిస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారని, అలా చెప్పినప్పుడు చంద్రబాబుకు సిగ్గు అనిపించడం లేదా అన్నారు.
చంద్రబాబు తమను ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి అడగలేదని బీజేపీ నేతలు చెప్పారన్నారు. చంద్రబాబు రాజధాని ప్రారంభోత్సవానికి, భూమిపూజకు ప్రధాని మోడీని ఆహ్వానించారని, అప్పుడు మోడీ ఎదుటే ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ అడిగారని చెప్పారు.
కానీ, ఇప్పటి దాకా చంద్రబాబు ప్రత్యేక హోదా ఇవ్వమని అడగలేదని బీజేపీ నేతలు చెబుతున్నారన్నారు. ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం ఏమి ఉంటుందని చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేశారన్నారు. హోదా అడగకుండా, తనకు కావాల్సిన పనులు చేయించుకున్నారన్నారు.
మీరు హోదా అడగలేదని, చిల్లర రాజకీయాలు వద్దని బీజేపీ నేతలు అంత నిష్కర్షగా చెప్పిన తర్వాత కూడా చంద్రబాబుకు కేంద్రంలో కొనసాగేందుకు చీము నెత్తురు లేదా, సిగ్గు లేదా అని అంబటి ధ్వజమెత్తారు. జగన్ హోదా గురించి దీక్ష చేస్తే అది దొంగ దీక్ష అని విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
మేం నిరాహార దీక్ష ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే, జగన్ను దొంగ దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నారని, నీకు దమ్ము లేదా అని నిలదీశారు. చంద్రబాబు ఇంకా కేంద్రంలో కొనసాగడం ఏమాత్రం సరికాదని చెప్పారు.
తెలంగాణ ప్రాజెక్టుల పైన జగన్ పోరాడుతుంటే టిడిపి నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. జగన్ పోరాటాన్ని వెనక్కి లాగి, తెలంగాణకు ఉపయోగపడేలా బాబు చేస్తున్నారన్నారు. హోదా పైన, తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల పైన బాబు పోరాడరు, జగన్ పోరాడుతానంటే అడ్డుకుంటారని ఎద్దేవా చేశారు.
ఓటుకు నోటు కేసు నేపథ్యంలోనే చంద్రబాబు అడ్డుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు తెలుగు ప్రజలకు, ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. జగన్ దీక్షను దొంగ దీక్ష అని చెప్పడం విడ్డూరమని, ఆయన ఎప్పుడూ దొంగ దీక్ష చేయలేదన్నారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబే దొంగ హామీలు ఇచ్చారన్నారు. జగన్ చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా గురించి కేంద్రం పైన, తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల పైన పోరాడుతున్నామని చెప్పారు. తాము తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు తీసుకున్నామని నిందలు వేయడం సరికాదన్నారు.
కేంద్రమంత్రి సుజనా చౌదరి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ప్రత్యేక హోదా పైన, తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల పైన తాము బహిరంగ చర్చకు సిద్ధమని, మీరు సిద్ధమా అని సవాల్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా సవాల్ చేశారన్నారు. చర్చకు మీరు సమయం, తేదీ చెప్పాలన్నారు.
జగన్ పైన దొంగ ఆరోపణలు సరికాదన్నారు. హోదా మీద, పక్క రాష్ట్రాలలోని ప్రాజెక్టుల మీద, చంద్రబాబు అలసత్వం మీద బహిరంగ చర్చకు సిద్ధమా చెప్పాలని సవాల్ చేశారు. బెజవాడ నడిబొడ్డున బీజేపీ నేత హోదా పైన చంద్రబాబును లాగి పెట్టి కొట్టారన్నారు. ఇంకా బాబుకు సిగ్గు లేదా అన్నారు.
చంద్రబాబును చిల్లర రాజకీయాలు చేయవద్దని బీజేపీ అన్నదని, అలాంటప్పుడు ఇంకా కేంద్రంలో ఎలా కొనసాగుతారని అన్నారు. అయినా ఆయన సిగ్గులేకుండా కొనసాగుతారని, ఎందుకంటే బయటకు వస్తే జైలుకు వెళ్తారని చెప్పారు. జగన్తో పాటు పోరాడానికి వచ్చే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. చంద్రబాబు ఇంకా నాటకాలు ఆడటం సరికాదన్నారు.