జగన్ అలా అనలేదు: కాపు రిజర్వేషన్లపై అంబటి, అంత స్పష్టంగా చెప్పాక: టీడీపీ
అమరావతి: కాపు రిజర్వేషన్లపై తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్లపై అనని మాటలను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు సోమవారం నిప్పులు చెరిగారు. ఆయన మాటలను వక్రీకరించారన్నారు. కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకమనలేదని, తమ పరిధిలో లేదని మాత్రమే అన్నారని తెలిపారు.
చంద్రబాబునే అంటారా, ఎక్కడో చెప్పు: పవన్ను ఏకేసిన శివాజీ, సీఎంకు కేవీపీ లేఖ
రాజకీయపరంగా లబ్ధి పొందేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం రాష్ట్ర పరిధిలో లేదని జగన్ అన్నారని గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామన్నారు. ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి తీసుకునే తత్వం జగన్ది కాదన్నారు.
కాపు ఉద్యమానికి అండగా ఉంది వైసీపీయే
జగన్ను ఉద్దేశించి కాపు నేత ముద్రగడ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అంబటి అన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబును ఏం చేశారని నిలదీశారు. నేటి వరకు కాపు రిజర్వేషన్ల అంశం పెండింగ్లోనే ఉందన్నారు. ముద్రగడ ఆమరణ దీక్షకు దిగితే తలుపులు పగలగొట్టి, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు లాక్కెళ్లారని, ఆ సమయంలో ముద్రగడకు అండగా ఉన్నది జగన్ అని గుర్తుచేశారు. కాపు ఉద్యమానికి అండగా ఉన్న పార్టీ వైసీపీయే అన్నారు.
అలా చెప్పలేదంటారా?
కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగ్గంపేట బహిరంగ సభలో జగన్ స్పష్టంగా చెప్పారని, కానీ ఇప్పుడు వైసీపీ నేతలు తమ అధినేత అలా చెప్పలేదని అనడం విడ్డూరమని మంత్రి చినరాజప్ప అన్నారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేస్తానని జగన్తో చెప్పించాలని డిమాండ్ చేశారు. అసలు కాపులకు న్యాయం చేస్తామని చెప్పడానికి జగన్కు ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్పాలన్నారు. నాడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కాపుల సర్వేకు రూ.40 లక్షలు కేటాయించలేకపోయారని మండిపడ్డారు.
జగన్ ముఖ్యమంత్రి కాలేడు
వచ్చే జగన్ ముఖ్యమంత్రి కాలేడనిఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, నిధులు కావాలని సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని 28 సార్లు అడిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. హోదాపై యూటర్న్ తీసుకున్నది చంద్రబాబు కాదని, బీజేపీ. ప్రధానియే అన్నారు.
సభలో ఉండకుండా రోడ్లపై తిరుగుతున్నారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సభలలో ఉండకుండా రోడ్లపై తిరుగుతున్నారని కేఈ ఎద్దేవా చేశారు. వారికి ప్రజా సమస్యలు ఏం తెలుస్తాయన్నారు. జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు ప్రధాని మోడీ డైరెక్షన్లో నడుస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు.