తుంటరి ఆటగాడు .. చెడ్డ కార్మికుడు .. ఓటమి ఒప్పుకోడు .. చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలు
చంద్రబాబు క్రీడా స్ఫూర్తిలేని ఓ తుంటరి ఆటగాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి అసెంబ్లీ అభ్యర్థి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబు చంద్రబాబుపై మాటల దాడి చేశారు . విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతోమాట్లాడిన ఆయన..చంద్రబాబుకు ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని మండిపడ్డారు .
ఏపిలో వైసీపి విజయం..కానీ రోజా ఓడుతుందటున్న సర్వేలు..! జబర్దస్త్ గా గెలుస్తానంటున్న ఫైర్ బ్రాండ్..!!
క్రీడాస్పూర్తి లేని ఆటగాడు .. తుంటరి ఆటగాడు చంద్రబాబు అన్న అంబటి రాంబాబు
కొంతమంది ఆటగాళ్లు ఓడిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లరని, రిఫరీలు, అంపైర్లు, తోటి ఆటగాళ్లతోనూ తగాదా పెట్టుకుంటారని అంబటి వ్యంగ్యస్త్రాలు సంధించారు. చంద్రబాబు కూడా అలాంటి ఆటగాడేనని ప్రజాస్వామ్యంలో తుంటరి ఆటగాడిలా వ్యవహరిస్తున్నారన్నారు.ఎన్నికల సంఘాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించడాన్ని స్వాగతించిన అంబటి రాంబాబు వీవీ ప్యాట్ ల విషయంలో సుప్రీం చంద్రబాబుకు మొట్టికాయలు వేసిందని ఎద్దేవా చేశారు. 5 వీవీప్యాట్లు లెక్కిస్తే సరిపోతుంది... దీనిని తిరిగి సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ బాబులో మార్పు రాలేదని రాంబాబు మండిపడ్డారు. విలువైన కోర్టు సమాయాన్ని వృధా చేయవద్దని నోటీస్ రిలీజ్ చేసినా చంద్రబాబుకు సిగ్గురావడం లేదని మండిపడ్డారు. తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందని అంబటి విమర్శించారు.
చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో తగాదా పట్టుకుంటాడు అన్న అంబటి రాంబాబు
ఓటమిని ఎన్నికల కమీషన్ మీదా, ఈవీఎంల మీదా నెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో తగాదా పెట్టుకుంటాడని.. అలాగే బాబు కూడా ఈవీఎం, వీవీప్యాట్, ఎన్నికల కమీషన్ పై ఏదో రాద్దాంతం చేస్తున్నారని రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కౌంటింగ్ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు గందరగోళానికి ప్రయత్నిస్తారని వైసీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని రాంబాబు పిలుపునిచ్చారు. అర్థరాత్రి వరకు జరిగిన పోలింగ్ బాబుకు వ్యతిరేకంగా పడినదేనని రాంబాబు తెలిపారు.
తొడలు కొట్టినోళ్ళు, మీసాలు తిప్పినోళ్ళు పాలించిన దాఖలాలు లేవన్న అంబటి
ఇక టీడీపీ నేతలైన దేవినేని ఉమ, బుద్దా వెంకన్నలపై మండిపడ్డారు. దేవినేని ఉమా పోలవరం పేరుతో ఇష్టారీతిగా ప్రజల సొమ్ము తిన్నాడని , అధికారంలోకి వచ్చిన తరువాత తిన్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు. అదే విధంగా బుద్ధా వెంకన్న తొడలు కొడుతున్నాడని, మీసాలు తిప్పి, తొడలు కొట్టినవారు ఎవరూ పాలించిన దాఖలాలు లేవన్నారు. నూటికి నూరుపాళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంబటి స్పష్టం చేశారు.