చంద్రబాబు, లోకేష్ లపై అంబటి ఫైర్..జూమ్ పెద్దబాబు,ట్విట్టర్ చినబాబు అంటూ ఎద్దేవా !!
టిడిపి అధినేత చంద్రబాబుపై, లోకేష్ ,టిడిపి నేతలపై వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదని, కావాలని చంద్రబాబు అధికార పార్టీ పై విమర్శలు గుప్పిస్తున్నారు అని మండిపడ్డారు. దళితులపై దౌర్జన్యం చేస్తే ఎంతటివారినైనా వైసిపి ప్రభుత్వం ఉపేక్షించదని ఆయన స్పష్టం చేశారు.
జూమ్ యాప్ కే పరిమితం అయిన పెదబాబు రాజకీయాలు
ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని పేర్కొన్న అంబటి రాంబాబు ఏపీలో ప్రతిపక్షం ఉన్నట్టుగా భ్రమలు కల్పిస్తున్నారని, కానీ ఏపీ ప్రజలు ప్రతిపక్ష పార్టీ ని ఎప్పుడో మర్చిపోయారు అంటూ విమర్శించారు. ఏపీ ప్రజలకు ప్రతిపక్షం దూరమైందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్ కు పరిమితమయ్యారు. జూమ్ యాప్ ద్వారా హైదరాబాద్లో ఉండి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, ఆయన జూమ్ బాబు అంటూ ఎద్దేవా చేశారు.
ట్విట్టర్ కి పరిమితం అయిన చినబాబు .. అంబటి ఎద్దేవా
తండ్రి బాటలో నారా లోకేష్ కూడా ట్విట్టర్ ద్వారా రాజకీయాలు చేస్తున్నారని, చిన్నాయన ట్విట్టర్ బాబు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులపై దాడులు జరిగితే నిష్పక్షపాతంగా కేసులు పెట్టి , తాటతీస్తున్నారని వ్యాఖ్యానించారు.ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దళితులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇక చంద్రబాబుకు ఎల్లో మీడియా ఒకటి తోడైందని, ఆ మీడియా సహకారంతో ప్రతిపక్ష పార్టీల నాయకుల పై బురద జల్లుతున్నారని వ్యాఖ్యానించారు.
అక్రమ మైనింగ్ ఆరోపణలు దురుద్దేశపూర్వకంగా
చంద్రబాబు దుష్ట రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో జరుగుతుంటే చంద్రబాబు సహించలేకపోతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రజలకు ఏ రోజు మంచి చేయలేదని ,ఆయనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై మైనింగ్ అక్రమ ఆరోపణలు చేస్తున్నారని, అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు అంబటి రాంబాబు. కావాలనే తప్పుడు ఆరోపణలతో దురుద్దేశ పూర్వకంగా పిల్ వేశారని అంబటి చెప్పుకొచ్చారు.
Recommended Video
నిరాధార ఆరోపణలకు భయపడేది లేదన్న అంబటి
మైనింగ్ దొంగలకు తను సహకరించలేదని అందుకే తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. నిరాధార ఆరోపణలకు తాను భయపడేది లేదని తేల్చి చెప్పారు. తన నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు తావు లేదని స్పష్టం చేసిన ఆయన,నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయి అంటూ వ్యాఖ్యానించారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబుపై మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారని, అదే నియోజక వర్గ వైసీపీ కార్యకర్తలు ఆయనపై హైకోర్టులో పిల్ వేశారు. ఎమ్మెల్యే మైనింగ్ అక్రమాలను అడ్డుకోవాలని కోర్టును కోరారు. ఈ పిటీషన్ పై కోర్టు విచారణ జరుపుతోంది .