నయవంచన దినమైతే బాగు: బాబుపై అంబటి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి ఏడాది పాలన వంచనతో సాగిందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్సించారు.
జూన్ 2వ తేదీన నవ నిర్మాణ దీక్షను ఉత్సవ దినంగా ఎందుకు పాటించాలని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ఉత్సవ దినం కన్నా నయవంచన దినంగా పాటిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ ఇప్పటి వరకు కూడా అమలు కాలేదని ఆయన అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకాల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని, చెప్పిన అబద్ధం చెప్పకుండా చంద్రబాబు చెబుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రచారం కోసం ఇచ్చే ప్రాధాన్యాన్ని అభివృద్ధిపై పెడితే మంచిదని ఆయన సూచించారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సిఐటియు నాయకుడు కందారపు మురళి అన్నారు. టిడిపి నాయకులు వీధి రౌడీల్లా వ్యవహరించారని ఆయన చిత్తూరులో అన్నారు. కుప్పం చంద్రబాబు అబ్బ సొత్తు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల హామీలు నెరవేర్చనందుకు స్థానికులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలపై శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభలో పాల్గొన్న నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ సిపిఎం నాయకులపై టిడిపి నాయకులు దాడి చేశారు.