భువనేశ్వరి బంధువు, వైయస్ ఫోటో: కొడాలి నాని ఇష్యూపై అంబటి, కొత్త కోణం
గుంటూరు: గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని కార్యాలయం ఖాళీ చేయించడం వెనుక మరో కారణం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం నాడు బాంబు పేల్చారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టడం వల్లే ఇంటి యజమానికి, నానికి మధ్య వివాదం తలెత్తిందన్నారు.
తమకు అద్దె చెల్లించడం లేదని భవన యజమానులు చెబుతున్నారు. అందుకే ఖాళీ చేయించమని చెప్పామంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఖాళీ చేస్తానని చెప్పానని, ఎన్టీఆర్ ఫోటో పక్కన వైయస్ ఫోటో పెట్టడం వల్లే ఖాళీ చేయించారని నాని ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అవే వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని సీఎం చంద్రబాబు పాలన చేయడం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపుతూ పోరాడే వారిపై దౌర్జన్యంగా కేసులు పెట్టించి, అణిచి వేయాలని చూస్తున్నారన్నారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, బందర్ మాజీ ఎమ్మెల్యే పేర్ని నానిలను అన్యాయంగా అరెస్టు చేసి తమ పార్టీని భయపెట్టేందుకు చూస్తున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిప్పటి నుంచి తమ పార్టీ నేతలను, కార్యకర్తలను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు.
చంద్రబాబు తీరు ప్రమాదకర సంకేతాలను సమాజానికి ఇస్తోందన్నారు. కొడాలి నాని గుడివాడలోని తన కార్యాలయంలో వైయస్ బొమ్మ పెట్టడం వల్లనే ఆ ఇంటి యజమానితో వివాదం తలెత్తిందన్నారు.
సక్రమంగా అద్దె చెల్లిస్తూ, యజమానికి ఖాళీ చేస్తామని నాని చెబుతున్నా, సీఎం సతీమణి నారా భువనేశ్వరి ఇంటి యజమాని బంధువు కావడంతోనే 500 మంది పోలీసులు వచ్చి దౌర్జన్యంగా ఖాళీ చేయించారన్నారు. చట్టప్రకారం కాకుండా కేవలం భువనేశ్వరి చెప్పిందని రాజ్యాంగాన్నే వారే రాసుకున్న చందంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు.