వైయస్ వివేకా ఓటమిపై అంబటి కామెంట్స్, జగన్ అనుకున్నదొక్కటి..
కర్నూలు, ఎస్పీఎస్ నెల్లూరులతో పాటు కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూసింది. స్వయంగా వైసిపి అధినేత జగన్ ఇలాకా కడపలో టిడిపి గెలిచింది.
అమరావతి: కర్నూలు, ఎస్పీఎస్ నెల్లూరులతో పాటు కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూసింది. స్వయంగా వైసిపి అధినేత జగన్ ఇలాకా కడపలో టిడిపి గెలిచింది.
దీనిపై వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కొత్త భాష్యం చెప్పారు. ఓ విధంగా వేదాంతం మాట్లాడారు. వైయస్ వివేకా ఓటమి ఓటమి కాదని, అలాగే బీటెక్ రవి గెలుపు గెలుపూ కాదన్నారు. ఓడిపోయినంత మాత్రాన రాజకీయ జీవితం ముగిసినట్లు కాదన్నారు.
వారి కృషి వల్లే
కడపలో బీటెక్ రవి గెలుపుకు ఇద్దరి కృషి ప్రధాన కారణమని టిడిపి నేతలు చెబుతున్నారు. వైయస్ వివేకా పైన బీటెక్ రవి 38 ఓట్లతో గెలుపొందారు. ఇంచార్జ్ మంత్రి గంటా శ్రీనివాస రావుతో పాటు ఎన్నికల ఇంచార్జ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల కృషి ఫలితమే ఈ గెలుపు అని టిడిపి నేతలు చెబుతున్నారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేతలంతా ఐక్యంగా పనిచేయడంతో దక్కిన ఈ విజయాన్ని ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తున్నట్లు నేతలు ప్రకటించారు. నెలన్నర రోజులుగా అటు వైసీపీ, ఇటు టీడీపీ శిబిరాలు నిర్వహిస్తూ సమీకరణలు పటిష్టం చేస్తూ స్థానిక శాసనమండలి ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యం కల్పించాయి.
వైసిపి అభ్యర్థిగా పోటీలో నిలబడింది వైయస్ వివేకానంద కాబట్టి వైసీపీ దీనిని ప్రతిష్టగా తీసుకున్నారు. జగన్ పార్టీకి ఇక్కడే దెబ్బకొట్టాలన్న యోచనతో టిడిపి తమ అభ్యర్థి బీటెక్ రవిని గెలిపించుకునేందుకు తీవ్ర కసరత్తు చేసింది.
ఆత్మ విశ్వాసం కొంపముంచిందా
కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి ఊహించింది ఒకటైతే, జరిగింది మరొకటి. తమ గుర్తుపై గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధుల బలం తమకు ఉందని గట్టిగా నమ్మారు. వారు ఏ శిబిరంలో వున్నా తమకే ఓటు వేస్తారని ఎక్కువగా విశ్వసించారు. ఆ విశ్వాసమే కొంపముంచింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు, కోడూరు ఎమ్మెల్సీ చెంగల్రాయుడు టిడిపిలో చేరడంతో భారీగా గండిపడింది.
అంతకుముందు, ఆ తర్వాత కడప జిల్లా పరిషత్లో జడ్పీటీసీలు, కడప కార్పొరేషన్లో కార్పొరేటర్లు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు వైసిపి నుంచి పదుల సంఖ్యలో టీడీపీతో జతకట్టారు. వీరు కాకుండా సుమారు నాలుగు మండలాల్లో టిడిపి పావులు కదిపింది. పాలకవర్గాలలోని సభ్యులను తమవైపు లాక్కుంది.
పావులు కదిపిన టిడిపి
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయం వచ్చేటప్పటికీ ఒక అంచనా ప్రకారం 521 మంది ఉన్న వైసీపీ స్థానిక ప్రతినిధుల బలం 412కు చేరింది. తర్వాత వైసిపి బలం సుమారు 398కి చేరింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతోనే టీడీపీ నేతలు పావులు కదిపారు. ఎన్నికల నేపథ్యంలో సుమారు 40 మందిని టీడీపీ అధికంగా సేకరించింది. దీంతో 440 దాకా ఎన్నికల ముందే గెలుపు నిర్ణయించే సంఖ్యను చేతిలో పెట్టుకున్న టిడిపి ఈ ఎన్నికల్లో విజయం సాధించగా బలం తిరగబడ్డ వైసీపీ ఓటమి చెందింది.
ఆశలు గల్లంతు
టిడిపి సమీకరణలపై ప్రత్యేక దృష్టి సారిస్తే వైసిపి తమకు క్రాస్ ఓటింగ్ అనుకూలిస్తుందన్న ఆశతో నష్టపోయింది. తమ పార్టీ నుంచి పోయిన వారు కొందరు తమకు ఓట్లు వేస్తారని, అంతేకాకుండా వైయస్ వివేకానంద రెడ్డి నేరుగా ఇళ్లకు వెళ్లి ఓటు అడగడంతో ఓటర్లు అందుకు అనుకూలంగా ఆయనకు ఓటు వేస్తారని భావించారు. ఇలాంటి ఆశలతో క్రాస్ ఓటింగ్పై ఆధారపడ్డారు.
అయితే టిడిపి నాయకులు క్రాస్ ఓటింగ్కు అడ్డుకట్ట వేశారు. కోడ్ ఇచ్చి ఓటేయమనడం, స్వయంగా నేతలు, బీటెక్రవి కుటుంబ సభ్యులు వారిని కలిసి ఓటు వేయాలని అభ్యర్థించడం లాంటివి క్రాస్ ఓటింగ్కు అడ్డుకట్ట పడడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో వైసిపి అనుకున్నదొకటైతే అయింది మరొకటి. వైసీపీ నేతలే కాదు జగన్ కూడా ఇదే అంచనాలలో ఉండటంతో వైసిపి ఎక్కువగా నష్టపోవడానికి కారణమైందని అంటున్నారు.