కెసిఆర్ కాళ్లు పట్టుకుని బయటపడాలని చూస్తున్నారు: బాబుపై అంబటి
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై దాడిని పెంచింది. ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కాళ్లు పట్టుకుని బయటపడాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
బిజెపి నేతలకు సైతం సమాచారం ఇవ్వకుండా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ హైదరాబాద్ ఎందుకు వచ్చారని ఆయన అడిగారు. కెసిఆర్, చంద్రబాబు మధ్య రాయబారానికే గోయల్ వచ్చారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్కు ముడుపులు ఇస్తూ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయినా టిడిపి నేతలు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
రేవంత్ రెడ్డి కెమెరాల్లో అడ్డంగా దొరికిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పదే పదే బాస్ అంటూ చెప్పిన పేరు చంద్రబాబు కాదా అని రాంబాబు అడిగారు. ఈ విషయంపై చంద్రబాబు సూటిగా ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు.
ఓటుకు నోటు కేసులో ఇప్పటికైనా తప్పు అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపి నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.