అంబటి రాంబాబు షాకింగ్ నిర్ణయం .. కోడెలపై కేసు పెట్టకుంటే నిరాహారదీక్షకు దిగుతా
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై కేసు నమోదు చెయ్యకుంటే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరిక జారీ చేశారు . ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏపీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అంబటి వర్సెస్ స్పీకర్ కోడెల మధ్య నెలకొన్న వివాదం తారా స్థాయికి చేరుకుంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోలింగ్ బూత్ క్యాప్చరింగ్ కు ప్రయత్నించి దొరికిపోయారని అంబటి రాంబాబు ఆరోపించారు.
స్పీకర్ కోడెలపై పలు ఆరోపణలు చేసిన అంబటి రాంబాబు .. కోడెల పై కేసు నమోదుకు డిమాండ్
పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు స్పీకర్ కోడెలపై పలు ఆరోపణలు చేశారు కులాలు, ప్రాంతాలను రెచ్చగొట్టి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అశాంతి సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెలపై ఐదుగురు పోలింగ్ ఏజెంట్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ముప్పాళ్ల ఎస్సై ఏడుకొండలును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మంగళవారం సాయంత్రంలోగా కోడెలపై కేసు నమోదు చెయ్యకుంటే నిరాహార దీక్ష చేస్తానంటున్న అంబటి రాంబాబు
మంగళవారం సాయంత్రంలోగా కోడెలపై కేసు నమోదు చెయ్యకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. నియోజకవర్గంలోని ఎన్నికల్లో అశాంతి సృష్టించిన కోడెల, ఆయన అనుచరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలింగ్ సమయంలో 30 యాక్ట్, 144 సెక్షన్ అమల్లో ఉంటే టీడీపీ నేతలు ఎలా ధర్నా చేస్తారని అంబటి రాంబాబు నిలదీశారు. తమపై నకిలీ వ్యక్తులు ఫిర్యాదులు చేస్తే హత్యాయత్నం కేసులు నమోదు చెయ్యడం దారుణమన్నారు. తమ ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు.
ఇనుమెట్ల ఘటనలో వైసీపీ ప్రమేయం లేదు .. కోడెల భీభత్సం సృష్టించారు
ఇనుమెట్ల కేసును నిష్పక్షపాతంగా విచారించాలని అంబటి రాంబాబు కోరారు. ఇనుమెట్ల గ్రామంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు బీభత్సం సృష్టించారని ఆరోపించారు. 160 నెంబర్ పోలింగ్ బూత్లోకి వెళ్లి స్పీకర్ కోడెల తలుపులు వేసుకుని గంటన్నరకు పైగా అక్కడే కూర్చొని ఉండటం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. దాంతో కోడెలను బయటకు పంపాలంటూ ఓటర్లు ఆందోళకు దిగారని, అయినప్పటికీ తాను ఇక్కడే ఉంటా ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఓటర్లపై కోడెల ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. దాంతో ఓటర్లు కోడెలపై తిరుగుబాటు చేశారని ఆరోపించారు. ఇందులో వైసీపీ నేతల ప్రమేయం లేదని అంబటి చెప్పారు .
మంగళవారం సాయంత్రంలోగా కోడెలపై కేసు నమోదు చెయ్యాలని డెడ్ లైన్.. లేకుంటే నిరాహార దీక్ష చేస్తానంటున్న అంబటి
స్వయంగా ఒక అభ్యర్థి పోలింగ్ బూత్ లోకి వెళ్లి తలుపులేసుకుని ఉండటం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాదా అని అసహనం వ్యక్తం చేశారు. కోడెల తీరుతో ఓటర్లు తిరగబడితే కంగుతిన్న కోడెల సొమ్మసిల్లి పడిపోయారని తెలిపారు. దాన్ని ఆసరాగా చేసుకుని కోడెలపై దాడి పేరుతో వైసీపీ నాయకులు అయిన తమపై కేసులు బనాయించారని ఆరోపించారు అంబటి రాంబాబు. అందుకే తమ ఫిర్యాదు తీసుకుని మంగళవారం సాయంత్రంలోగా కోడెలపై కేసు నమోదు చెయ్యాలని డెడ్ లైన్ విధించారు. అప్పటిలోగా కేసు నమోదు చెయ్యకుంటే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.