నిమ్మగడ్డలో చంద్రబాబు పరకాయ ప్రవేశం..? 'ఏకగ్రీవాలు' ఆయనే వద్దన్నారేమో...కక్ష సాధింపే : అంబటి రాంబాబు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అభ్యంతరమేమీ లేదని... కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని భావిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. 2018లో చంద్రబాబుకు నష్టం జరుగుతుందనే ఆనాడు ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదన్నారు. మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించని ఎస్ఈసీ.. అప్పుడు ఎందుకని న్యాయస్థానాలను ఆశ్రయించలేదని ప్రశ్నించారు.మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా నిద్రపోయిన ఎన్నికల కమిషనర్కు... మూడు మాసాలు ఆగేందుకు మాత్రం ఏమిటి అభ్యంతరమని నిలదీశారు.
Recommended Video
నిమ్మగడ్డది కక్ష సాధింపు...
మూడు మాసాల తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించవచ్చునని... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నా లేకున్నా ఎన్నికల కమిషన్ ఉంటుందని అంబటి రాంబాబు అన్నారు. కేవలం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారన్న కారణంతోనే కొంతమంది ఐఏఎస్లు,ఐపీఎస్లపై నిమ్మగడ్డ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేవలం అహంకారపూరిత ధోరణితో నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు సిద్దమయ్యారు తప్పితే... విధి నిర్వహణ పట్ల ఆయనకు చిత్తశుద్ది లేదన్నారు.
ఎవరికైనా ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత... : అంబటి
అమెరికాలో,ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని నిమ్మగడ్డ ప్రస్తావించడాన్ని అంబటి రాంబాబు గుర్తుచేస్తూ... వ్యాక్సినేషన్ కన్నా ముందే అక్కడ ఎన్నికలు జరిగాయన్నారు. ఉద్యోగులు వ్యాక్సిన్ పంపిణీ విధుల్లో ఉన్న కారణంగా ఏకకాలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ,ఎన్నికలు సాధ్యం కావన్నారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు కూడా తెలియజేశామన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే కోవిడ్ 19 కేసులు పెరుగుతాయి... అదే వ్యాక్సినేషన్ చేపడితే కోవిడ్ 19 కేసులు తగ్గుతాయని అన్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే... ఎన్నికల విధుల్లో బీపీ,సుగర్,ఇతరత్రా వ్యాధులు కలిగిన ఉద్యోగులెవరికైనా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
నిమ్మగడ్డలో చంద్రబాబు పరకాయ ప్రవేశం...?
ప్రజలు,ఉద్యోగుల క్షేమం గురించి తాము ఆలోచిస్తున్నామని... అంతే తప్ప ఎన్నికలంటే తమకేమీ భయం లేదని అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికలు రాజ్యాంగబద్దమైన వ్యవహారమని,ఇదేమీ నిమ్మగడ్డ వ్యక్తిగత వ్యవహారమేమీ కాదని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చినందుకు.. కరోనా సమయంలో ఎన్నికలతో వారిపై కక్ష సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు. ఏకగ్రీవాలపై ఐజీ స్థాయి పర్యవేక్షణ ఉంటుందని నిమ్మగడ్డ ప్రకటించడాన్ని అంబటి తప్పు పట్టారు. బహుశా ఆయనే ఈ మాట చెప్పించారేమోనని పరోక్షంగా చంద్రబాబును టార్గెట్ చేశారు. గతంలో ఏకగ్రీవాలైన పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అంబటి గుర్తుచేశారు. చంద్రబాబు ఎందులోకైనా పరకాయ ప్రవేశం చేయగలరని... ఇవాళ నిమ్మగడ్డ ప్రెస్ మీట్లోనూ ఆయనలోకి పరకాయ ప్రవేశం చేసి ఉంటారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.