రోజా గుండు కొట్టించుకుంటే నీకు చూడాలని ఉందా? ఏంటీ వికృత ఆనందం?: బోండా ఉమపై అంబటి ఫైర్
నంద్యాల ఉపఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే విషయమై ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమపై మండిపడ్డారు.
అమరావతి: నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే తాను గుండు చేయించుకుంటానని, గెలిస్తే కనుక, రోజా గుండు చేయించుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ఇటీవల చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి.
అయితే, నంద్యాల ఉపఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే విషయమై ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమపై అంబటి మండిపడ్డారు. 'చౌకబారు మాటలు, చౌకబారు రాజకీయాలు. గుండును, బోండాను చూపించి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? నీ బోండాను, నీ గుండును నీ దగ్గరే అట్టేపెట్టుకో. చెప్పేది విను.. సభ్యత, సంస్కారం ఉండాలి దేనికైనా!' అంటూ రాంబాబు హితవు పలికారు.
అంతేకాదు, 'బోండా ఉమ అనే వ్యక్తి ఓ శాసనసభ్యుడు. ఈయన గుండు కొట్టించుకోవడమేంటి? రోజా గుండు కొట్టించుకోవడమేంటి? మీ గుండ్లు చూసేందుకేనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంది? ఏదైనా ఛాలెంజ్ చేయాలంటే ..'రాజకీయ సన్యాసం చేయండి' అనే మాటలు అనాలి గాని, గుండ్లు చేయించుకోవడమేంటి?' అని వ్యాఖ్యానించారు.
ఇంకా, 'మీరు గెలిస్తే, రోజా గారు గుండుకొట్టించ్చుకోవాలా? రోజా గారు గుండు కొట్టించుకుంటే చూడాలని ఆనందంగా ఉందా? ఏంటీ, వికృతమైన ఆనందం? నాకు అర్థం కాలేదు. నీకు సమ్మగా ఉంటే నువ్వు గుండు చేయించుకో.. సంస్కారం లేకుండా ఈ గుండ్లు కొట్టించుకునే పద్ధతి ఏంటీ? సభ్యత, సంస్కారం ఉండాలి? ఒక మంచి విషయాన్ని చర్చించాల్సింది పోయి.. గుండ్లు, బోండాలు.. ఏంటీ? మీరు ఒక్క మాట మాట్లాడితే, నేను వంద మాటలు మాట్లాడగలను' అంటూ అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.