మాకు సంబంధం లేదని అంబటి, జగన్ పిలుపు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి ఓ పత్రిక సంబంధం లేని కథనాలు రాస్తోందని మండిపడ్డారు. ఆ పత్రిక ప్రజా సమస్యల పైన దృష్టి పెడితే బాగుంటుందన్నారు. ఆ పత్రికలో వచ్చిన కథనాలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. చంద్రబాబు విలువైన సమయాన్ని అంతా సమీక్షలు, మీడియా ముందు ఉపన్యాసాలకే కేటాయిస్తున్నారన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శించాలన్నది తమ ఉద్దేశ్యం ఏమాత్రం కాదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసే వరకు చంద్రబాబు విశాఖకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
తాటిచెట్లపాలెంలో వైయస్ జగన్
హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడో రోజైన గురువారం పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం తాటిచెట్లపాలెంలో పర్యటించి బాధితులను ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.
జగన్కు మహిళలు తమ గోడు వినిపించారు. ధర్మనగర్లో తుఫాను బాధితులను జగన్ పరామర్శించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలు ముమ్మరం చేయాలని జగన్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
'రూ.5వేల కోట్లివ్వాలి'
హుధుద్ తుఫాను వల్ల నష్టపోయిన ఉత్తరాంధ్ర పునరుద్ధరణకు వెయ్యి కోట్లు సరిపోవని, ఐదువేల కోట్లు ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. తుఫాను వల్ల రూ.70వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారని, దీని పైన ప్రభుత్వం అఖిల పక్షం ఏర్పాటు చేయాలని, కేంద్రానికి నివేదిక ఇవ్వాలన్నారు.
చంద్రబాబు సర్కారు రుణమాఫీ చేయక పోవడంతో రైతులు భీమా అవకాశాన్ని కోల్పోయారన్నారు. రైతులకు ఇది తీవ్ర నష్టమే అన్నారు. చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి రైతులకు పంట బీమా వర్తించేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తే ఊరటగా ఉంటుందన్నారు.