పవన్! మమ్మల్నంటారా?, సిగ్గు, లజ్జా ఉందా?: టీడీపీ ఎంపీలు, బాబుపై అంబటి నిప్పులు
Recommended Video
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరగకపోవడంపై అంబటి తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రధాని అపహాస్య పరిచేలా వ్యవహరించారని మండిపడ్డారు.
ప్రధాని తప్పును ఒక్క రోజు దీక్షతో ప్రతిపక్షాలపై నెట్టే యత్నం చేస్తున్నారని అంబటి ఆరోపించారు. ఇక చంద్రబాబు సింగపూర్ పెట్టుబడుల పర్యటన రామాయాణంలో పిడకల వేటలాటిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన విదేశీ పర్యటనలతో సాధించించదేమీ లేదని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా ఏప్రిల్ 16న చేసే ఏపీ బంద్కు మద్దతు తెలపాలని అన్నారు.
బాబు నియంత కాదు..
చంద్రబాబు సీఎం మాత్రమేనని, నియంత కాదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం నిరసనలు ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నిరసనలు చేయలేదా? అని అంబటి ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వాన్ని బ్రిటీష్ ప్రభుత్వంతో పోల్చిన చంద్రబాబు.. నాలుగేళ్లు వారితో ఎందుకు కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించారని నిలదీశారు. అప్పుడు హోదా అవసరం లేదని ఇప్పుడు కావాలని అంటున్నారని మండిపడ్డారు.
బఫూన్లలా టీడీపీ ఎంపీలు
సబ్సిడీతో వచ్చే ఫుడ్ తిని టీడీపీ ఎంపీలు పార్లమెంటు వద్ద విచిత్ర వేషాలు వేశారని అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఎంపీలు బుద్ధి తెచ్చుకుని రాజీనామాలు చేయాలని అంబటి అన్నారు. టీడీపీ ఎంపీలంతా ఢిల్లీలో బఫూన్లలా వ్యహరించారంటూ మండిపడ్డారు. జేసీ దివాకర్ రెడ్డి, గల్లా జయదేవ్ లాంటి టీడీపీ ఎంపీలందరూ తమ వ్యాపారాల కోసమే ఎంపీలుగా ఉన్నారని అన్నారు.
బాబు బినామీ మురళీ మోహన్
ప్రధాని సభలో లేనప్పుడు జయదేవ్ మిస్టర్ మోడీ అంటూ వ్యాఖ్యానించారని ఎద్దేవా చేశారు. ఇక మరో ఎంపీ మురళీమోహన్.. సీఎం చంద్రబాబు ఆస్తులకు బినామీ అని అంబటి రాంబాబు ఆరోపించారు. అమరావతిలో భూములు ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు.
సిగ్గు, లజ్జా ఉంటే..
సిగ్గు, లజ్జా ఉంటే టీడీపీ ఎంపీలు ఇప్పటికైనా రాజీనామా చేయాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. చంద్రబాబు భాషలో పోరాటమంటే రాజీనామాలు కాదు, ఆందోళనలు కాదు.. విచిత్ర విషాలు వేయడమేనని అర్థమైందన్నారు. 16న చేసే బంద్ను విఫలం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారని ఆరోపించారు. మోడీకి ఉపయోగపడేలా బాబు చర్యలు ఉండవచ్చని అన్నారు.
చంద్రబాబును ఎలా నమ్ముతారు?
మోడీ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసేందుకే ఏపీ బంద్ చేస్తున్నామని, బాబు ఇందుకు సహకరించాలని కోరారు. చంద్రబాబు అవిశ్వాసం లేదని అని.. ఇప్పుడు అవిశ్వాసం పెట్టారని, హోదా అవసరం లేదని.. ఇప్పుడు హోదా పోరాటం అంటున్నారని చంద్రబాబుపై అంబటి మండిపడ్డారు. మాటలు మార్చే బాబును ప్రజలు నమ్మరని అన్నారు. మోడీ-బాబు జోడీ ఏపీ అభివృద్ధి అన్నారు.. ఇప్పుడు ఆ జోడీ విడిపోయింది ఇక ఏపీ అభివృద్ధి ఎక్కడ? అని ప్రశ్నించారు. ఏపీని అభివృద్ది చేసే బాధ్యత వారిద్దరిపైనా ఉందన్నారు. చంద్రబాబు.. బంద్ చేస్తే అభివృద్ధి ఆగుతుందనడం సరికాదని, ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదా? అని ప్రశ్నించారు. బంద్ను విఫలం చేయాలని చూస్తే చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.
సింగపూర్ పర్యటనపై అనుమానాలు
చంద్రబాబుకు ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో తనకు తెలియడం లేదని అన్నారు. కేంద్రంతో లాలూచీ కోసమో, కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలనో చంద్రబాబు సింగపూర్ వెళ్లి ఉంటారని అన్నారు. బాబు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదని రాజకీయ ప్రయోజనాల కోసమేనని అంబటి ఆరోపించారు. బాబు గత నాలుగేళ్లలో అమరావతిలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. అమరావతిని స్కాం నగరంగా మార్చారని దుయ్యబట్టారు.
పవన్ మమ్మల్ని ప్రశ్నించడమా?
తమ చిత్తశుద్ధిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం సరికాదని అన్నారు. ఆయనో లీడర్ అవ్వాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. హోదా కోసం తాము పార్లమెంటులో అవిశ్వాసం పెట్టామని, రాజీనామాలు చేశామని, ఆమరణ దీక్షలు చేశామని.. ఇలాంటి తమకు చిత్తశుద్ధి లేదంటే వారికే చిత్తశుద్ధి లేదని తెలుస్తోందని అన్నారు. తమ పోరాటాన్ని శంఖించాల్సిన అవసరం లేదని అన్నారు. ఏపీకి హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది ఒక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. హోదాను బతికుండాలే చేసింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు.