40 ఏళ్లన్నావ్.. సిగ్గుందా: బాబుపై అంబటి, నటి శ్రీరెడ్డి వెనుక వైసీపీ ఉందా అంటే..?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఆయన దొంగ దీక్షలు చేస్తున్నారని, ఢిల్లీకి వెళ్లి దీక్ష చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. అలాగే, సినీ నటి శ్రీరెడ్డి ఆందోళనల వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని ప్రచారం జరగడంపై కూడా ఆయన స్పందించారు.
నేను ఒక్కడినే: దేవినేని అవినాశ్కు లోకేష్ హామీ, 'టచ్లో 10మంది వైసీపీ ఎమ్మెల్యేలు'
హోదా కోసం ఏపీలో ఉద్యమం చేస్తే నష్టం జరుగుతుందని, ఢిల్లీలో వెళ్లి ఉద్యమం చేయాలని చంద్రబాబు ఇది వరకు చెప్పారని, కానీ ఆయన ఇక్కడ దీక్ష చేయడం ఏమిటని ప్రశ్నించారు. జపాన్ తరహా ఉద్యమం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇటీవల ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ సైకిల్ యాత్రలు చేపట్టిందని, అప్పుడు మంత్రి నారా లోకేష్ అలసిపోయారట.. కానీ చంద్రబాబు మాత్రం అలసిపోలేదట.. అసలు వదిలేసి ఈ కొసరు ఏమిటని ప్రశ్నించారు.
రేపు బాబు దీక్షకు తండోపతండాలుగా.
రేపు చంద్రబాబు దీక్షకు తండోపతండాలుగా వచ్చిన విద్యార్థులు అంటూ చెబుతారని, వారికి పెరుగన్నం పెడతారట అని, దానికి ప్రభుత్వం సొమ్ము ఉపయోగించడం ఏమిటని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు తలుచుకుంటే మోడీ వణికిపోతారని, ఢిల్లీ బెదిరిపోతుందని రేపు రాస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే దీక్ష అనైతికం, సరైనది కాదన్నారు.
చంద్రబాబు చక్రం తిప్పుతారని
చంద్రబాబు కేంద్రం చక్రం తిప్పుతారని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చంద్రబాబు చెబుతారని, మరి నలభై ఏళ్లు దాటిన, అనుభవం లేని యువకుడు జగన్ను ఎందుకు కాపీ కొడతున్నావని ప్రశ్నించారు. అతనిని అనుసరించేందుకు సిగ్గులేదా అన్నారు. ప్రజలను చంద్రబాబు మోసం చేశాడని, ఆయన తన కుటుంబాన్ని మోసం చేయలేదా, మామగారిని మోసం చేయలేదా, హోదా విషయంలో ఏపీ ప్రజలను మోసం చేయలేదా.. అలాంటి నిన్ను మోసగాడు అంటే తప్పేమిటన్నారు.
జగన్ పోరాట యోధుడు అందుకే కేసులు
చంద్రబాబు చేసే దీక్ష 420 అన్నారు. ఆయనది అధర్మ దీక్ష అన్నారు. జపాన్ తరహా దీక్ష అంటే గొప్ప దీక్ష అనుకున్నామని, సైకిల్ దీక్ష, ఊరూరా దీక్ష.. ఇవన్నీ జపాన్ తరహా దీక్షలా అని ఎద్దేవా చేశారు. అసలు జపాన్ తరహా దీక్ష అంటే ఏమిటో చెప్పు చంద్రబాబు అంటే చెప్పరని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచే రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారన్నారు. ఏమైనా అంటే జగన్పై కేసులు, 420 అంటూ టార్గెట్ చేస్తున్నారు. కానీ జగన్ పైన కేసులు ఎందుకున్నాయో తెలుసుకోవాలన్నారు. వీరోచితమైన పోరాటం చేశాడు కాబట్టి ఆయనపై కేసులు ఉన్నాయన్నారు. చంద్రబాబు రాజీపడ్డారు కాబట్టి కేసులు ఉండవన్నారు. పోరాటాల పురిటిగడ్డలో పుట్టిన పార్టీ వైసీపీ అన్నారు. అందుకే చంద్రబాబు తమకు భయపడుతున్నారన్నారు.
బాబును నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే
చంద్రబాబు పెద్ద మానిప్యులేటర్ అన్నారు. నిన్ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అన్నారు. చంద్రబాబు కొంగ జపాలు, నిరాహార దీక్షలు నమ్మవద్దన్నారు. అవసరమైతే కేంద్రానికి అమ్మేస్తారన్నారు. బాబు ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజల సొమ్ముతో ఆర్భాటాలా అని ప్రశ్నించారు. ఎన్నో మోసాలు చేసిన చంద్రబాబును 420 అంటే తప్పేమిటన్నారు. ఏ ధర్మ పంథాలో లోకేష్ను మంత్రిగా చేశారన్నారు.
త్వరలో స్పీకర్ కోడెలపై మాట్లాడుతా
త్వరలో స్పీకర్ కోడెల శివప్రసాద్ పైన మాట్లాడుతానని అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ స్పీకర్ సైకిల్ తొక్కారని, టీడీపీ జెండా పట్టుకున్నారని, ఆయన గురించి మరో సందర్భంలో మాట్లాడుతానని చెప్పారు. ఆయన స్పీకర్గా వ్యవహరించడం లేదన్నారు. టీడీపీ వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇది సరికాదన్నారు. ఈ నెల 20న కూడా దీక్షలో కూర్చుంటారట.. ఆ తర్వాత మాట్లాడుతానని చెప్పారు.
శ్రీరెడ్డి వెనుక వైసీపీ లేదు
సినీ నటి శ్రీరెడ్డి వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైసీపీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ అని, ఎవరి వెనుకో ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. తమకు మరొకరి వెనుక ఉండాల్సిన పరిస్థితి లేదన్నారు. ఏదైనా ఉంటే సూటిగా, ఘాటుగా ఇలాగే మాట్లాడుతామన్నారు. కానీ ఎవరి వెనుక తాము ఉండమని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా వారి వెనుక వైసీపీ ఉందని చెప్పడం సరికాదన్నారు. శ్రీరెడ్డి వెనుక లేదా మరో రెడ్డి వెనుక వైసీపీ లేదని, దయచేసి అలాంటి ప్రచారాలు నమ్మవద్దని చెప్పారు.