శునకానందం: బాబుపై విజయసాయి, చిరంజీవి-ఎన్టీఆర్లను లాగి పవన్కు టీడీపీ కౌంటర్
విజయవాడ: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవహేళన చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు ఆదివారం అన్నారు. తమ పార్టీని కోడి కత్తి పార్టీగా అభివర్ణించడం చాలా దారుణం అన్నారు.
నన్ను రెచ్చగొడితే ఏమవుతుందో అర్థమైందా: బాబు, కాంగ్రెస్తో దోస్తీ, కేసీఆర్ పాలనపై కీలక వ్యాఖ్యలు
అసలు తెలుగుదేశం పార్టీ శునకానంద పార్టీగా మారిందని అంబటి విమర్శించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలది నీతిబాహ్యమైన పొత్తు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, టీడీపీలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయమై పునరాలోచన చేయాలన్నారు. పదవుల కోసమే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని, కానీ ప్రజల కోసం మాత్రం కాదని అంబటి రాంబాబు చెప్పారు.
అందుకే రాహుల్ గాంధీతో చంద్రబాబు పూసుకు తిరుగుతున్నారు
చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. 'ఐటీ సోదాల నుంచి రక్షణ పొందేందుకే చంద్రబాబు రాహుల్ తో పూసుకు తిరుగుతున్నాడు. జాతీయ స్థాయి లీడర్ నని ఐటి శాఖను బెదిరించాలని చూస్తున్నాడు. చిదంబరం, రాబర్ట్ వద్రాలే అక్రమ సంపాదన కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు. రాహులేం కాపాడతాడు?' అని పేర్కొన్నారు.
చంద్రబాబు శునకానందం
మరో రెండు ట్వీట్లలో.. 'చంద్రబాబు నాయుడు గారూ...
మా పార్టీని మీరు కోడి కత్తి పార్టీ అంటూ దిగజారి శునకానందం పొందుతున్నారు. కాబట్టి, ఇక మీదట మీ పార్టీని మేం శునకానందం పార్టీగా పిలుస్తాం. మిమ్మల్ని శునకానంద నాయుడుగా పిలుస్తాం. సరేనా?', 'స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)లు,కమిషన్లు చంద్రబాబు చెప్పినట్లుగా నివేదికలు ఇచ్చే వ్యవస్థలన్నది బహిరంగ రస్యం.అవి బాబు ‘సిట్'అంటే కూర్చుని,‘స్టాండ్'అంటే నిలబడి తమ వీరవిధేయతను ప్రకటిస్తాయి.సీఎంగా 14ఏళ్ళ హయాంలో బాబు వేసిన సిట్లు,విచారణలు ఉత్తిత్తివే అన్నది చారిత్రక సత్యం.' అని పేర్కొన్నారు.
చిరంజీవి, కన్నాలను లాగి పవన్కు చినరాజప్ప కౌంటర్
బీజేపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన హోంమంత్రి చినరాజప్ప నిప్పులు వేరుగా చెరిగారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారేనని ఆయన చెప్పారు. అలాగే, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మీ అన్నయ్య చిరంజీవి కేంద్రమంత్రి అయ్యారని గుర్తుంచుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ కంటే బీజేపీ ప్రమాదం, ఎన్టీఆర్ మద్దతిచ్చారు
చంద్రబాబును అణగదొక్కేందుకు బీజేపీ గత ఆరు నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని చినరాజప్ప అన్నారు. అప్పటి కాంగ్రెస్ కంటే ఇప్పటి బీజేపీ చాలా ప్రమాదకరమని చెప్పారు. మంచి, చెడులు ఆలోచించే కేంద్రంలోని ప్రతిపక్షాలను అన్నింటిని చంద్రబాబు 17 పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలను కలిశారని చెప్పారు. పీవీ నర్సింహా రావు ప్రధానమంత్రి అయ్యే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ మద్దతు ఇచ్చారని అన్నారు.