నెల్లూరు జిల్లాలో అస్తవ్యస్తంగా స్ధానిక రిజర్వేషన్లు- బీసీ కోటాలో తారుమారైన లెక్కలు
నెల్లూరు జిల్లాలో స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా ఖరారు చేసిన బీసీ రిజర్వేషన్లు గత లెక్కలతో పోలిస్తే పొంతన కుదరడం లేదు. గతంతో పోలిస్తే పలు చోట్ల ఎంపీటీసీ స్ధానాల్లో భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. కేవలం పది శాతం కోటా తగ్గితే బీసీ రిజర్వేషన్లలో ఇంత వ్యత్యాసం ఎలా వస్తుందని అభ్యర్ధులు గగ్గోలు పెడుతున్నారు.
ఏపీ స్ధానిక ఎన్నికలు- బీసీ రిజర్వేషన్లు
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల కోసం గతంలో ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లను ఖరారు చేసింది. కానీ సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా లేదన్న కారణంతో హైకోర్టు ఈ ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో గతంలో లాగే 50 శాతం రిజర్వేషన్లకే పరిమితం కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 34 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లు దాదాపు పదిశాతం తగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కోర్టు ఏం చెప్పింది- వాస్తవంగా ఏం జరుగుతోంది ?
59.85 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 50 శాతానికి తగ్గిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా నెల్లూరు జిల్లాలో తాజా రిజర్వేషన్ల ఖరారైన జాబితా చూస్తే మనకు మతి పోతుంది. నెల్లూరులో గతంలో 50 రిజర్వేషన్ ప్రకారం 55 ఎంపీటీసీలకు 16 స్ధానాలు బీసీలకు వస్తే ఇప్పుడు 7 మాత్రమే వచ్చాయి. ఆత్మకూరుకు గతంతో 19 ఎంపీటీసీలుంటే, ఇప్పుడు 14 మాత్రమే వచ్చాయి. కోవూరుకి గతంలో 29 ఎంపీటీసీలుంటే, ఇప్పుడు ఏడే వచ్చాయి.నెల్లూరు రూరల్ గతంలో 3 ఉంటే, ఇప్పుడు ఒక్కటే వచ్చింది. సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో 26 ఎంపీటీసీలుంటే, ఇప్పుడు 7 స్థానాలు మాత్రమే వచ్చాయి. గూడూరుకు గతంలో ఏడు వస్తే, ఇప్పుడు సున్నా.. సూళ్లూరుపేటకు గతంలో 17 ఉంటే, ఇప్పుడు 1స్థానమే. వెంకటగిరి నియోజకవర్గంలో గతంలో 18ఉంటే, ఈ ఎన్నికల్లో 5స్థానాలు మాత్రమే. ఉదయగిరికి గతంలో 21 ఉంటే, ఇప్పుడు 18మాత్రమే.
జిల్లాలో బీసీ రిజర్వేషన్ల సగటు 10 శాతమే
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే సరాసరిన 10.68 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని తెలుస్తోంది. ఆత్మకూరులో 20.09 శాతం, ఉదయగిరిలో 21.69 శాతం అమల్లోకి వచ్చాయి. జిల్లాలో ఎక్కువ బీసీ ఓటర్లున్న నియోజకవర్గమైన కోవూరులో 8.97శాతం మాత్రమే అమలుచేశారు. నెల్లూరు రూరల్ 8.33, సర్వేపల్లిలో 8.66 శాతం అమలుచేశారు.సుళ్లూరుపేటలో 1.64 శాతం మాత్రమే. వెంకటగిరి 7.46 శాతమే. దీంతో అసలు రిజర్వేషన్ల ప్రక్రియ అసలు అమలైందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
రిజర్వేషన్ అమలు కాక ఆశావహుల గగ్గోలు
తాజాగా నెల్లూరు జిల్లాలో ఖరారైన రిజర్వేషన్లను గమనిస్తే ఇవన్నీ కోర్టు ఆదేశాలప్రకారమే చేశారా... లేక సొంతంగా రాశారా అనే అనుమానం తలెత్తుతోంది. 50శాతం రిజర్వేషన్లు అమలైతే, ఇంత భారీ వ్యత్యాసం ఉంటుందా అని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లు తగ్గింది ఎంతశాతం... ఇక్కడ అమలుచేస్తోంది ఎంతశాతం అనే ప్రశ్న తలెత్తుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీల పరిస్ధితి చూస్తే గత ఎన్నికల్లో బీసీలకు జిల్లాలో 166 స్ధానాలు రిజర్వ్ అయితే, ఇప్పుడు మాత్రం 60 స్థానాలతో సరిపెట్టారు.
దీంతో పదిశాతం రిజర్వేషన్ల తగ్గింపుతో ఇంత వ్యత్యాసం ఎలా వస్తుందన్న అనుమానాలు మొదలయ్యాయి. రిజర్వేషన్ల అమలులో లోపాలతో సీట్లు ఆశించిన ఆశావహులంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. నామినేషన్ల నాటికి సవరించకపోతే తమ పరిస్ధితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.