చంద్రబాబు నియమించిన మరో ఛైర్మన్ రాజీనామా: త్వరలో వర్ల రామయ్య, జూపూడి!
అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియమితులైన వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే దర్శకేంద్రుడు తన పదవి నుంచి వైదొలిగారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్గా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా- సినిమా, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని శుక్రవారం ఉదయం సమాచార శాఖ ముఖ్య కార్యదర్శికి పంపించారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు.
రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అంబికా కృష్ణ. పార్టీకి ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను సినిమా, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా నియమించింది. ఆయన పదవీ కాలం ఇంకా ఏడాది పాటు ఉంది. ఈ లోగా- రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఫలితంగా- అప్పటి ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టులన్నీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనితో అంబికా కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం, ఆర్టీసీ సహా పలు కార్పొరేషన్లకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఛైర్మన్లు నియమితులయ్యారు. తమను నియమించిన, తాము కొనసాగుతున్న పార్టీ అధికారాన్ని కోల్పోయినందున వారంతా నైతికంగా తమ పదవులకు రాజీనామాను చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కె రాఘవేంద్ర రావు, అంబికా కృష్ణ మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వారిద్దరూ సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కావడం గమనార్హం. మరి కొద్దిరోజుల్లో పలువురు ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామాలను చేస్తారని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఆర్టీసీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. త్వరలోనే ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్గా పనిచేసిన లింగారెడ్డి.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో- ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా ఇదివరకే తన ఛైర్మన్ గిరీకి గుడ్బై చెప్పారు.
కాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం తాను రాజీనామా చేసేది లేదని భీష్మిస్తున్నారు. తన పదవీ కాలం మొత్తం ముగిసేంత వరకూ తాను ఎటూ కదలబోనని అంటున్నారు. దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. ఆయన పదవీ కాలం ముగిసే నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం.. టీటీడీకి కొత్త ఛైర్మన్ను నియమించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా కసరత్తు కొనసాగుతోందని చెబుతున్నారు.