కాలి బూడిదైన అంబులెన్స్:మృతదేహాన్ని తరలిస్తుండగా...మార్గమథ్యంలో
విశాఖపట్టణం:అర్థరాత్రి మృతదేహాన్ని తరలిస్తుండగా దారి మధ్యలో అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమప్తతతో వాహనం లోని వాళ్లంతా మృతదేహంతో సహా కిందికి దిగి పోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
విశాఖ జిల్లా మధురవాడ పిఎంపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల జాతీయ రహదారిపై తెల్లవారు మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి రాంచీకి అంబులెన్స్లో శనివారం అర్ధరాత్రి మృతదేహం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే...
విశాఖ నుంచి రాంచీకి శనివారం అర్థరాత్రి దాటాక అంబులెన్స్లో ఒక మృతదేహాన్నికుటుంబ సభ్యులకు అందచేసేందుకు తరలిస్తుండగా మార్గమథ్యంలో ఆ అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. విశాఖలో బయలు దేరిన వాహనం పీఎంపాలెం సమీపానికి రాగానే ఒక్కసారిగా వాహనంలో మంటలు ఎగసిపడ్డాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై అంబులెన్స్ను నిలిపివేయగా అందులోని సిబ్బంది వెంటనే మృతదేహాన్ని పక్కకు దించి దూరంగా తొలగిపోయారు.
వారు వాహనం నుంచి దిగిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే మంటలు ఎక్కువై, వాహనమంతా వ్యాపించాయి. చూస్తుండగానే అంబులెన్స్ మొత్తం కాలిపోయింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని మరో అంబులెన్సులో తరలించారు.