ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని: అమరావతికి మద్దతుగా అమెరికాలో ర్యాలీలు, ఎన్నారైలు ఏమన్నారంటే.?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలని గత 27 రోజులుగా ఆ ప్రాంత రైతులు, ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇతర దేశాల్లోని పలువురు తెలుగువారు కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తుండటం గమనార్హం.
ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని
అమెరికాలోని వర్జీనియాలో ప్రవాసాంధ్రులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో ‘ఎన్నారై రైతు బిడ్డలం' పేరిట వర్జీనియా వీధుల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు, చిన్నారులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సియాటిల్, మినియాపోలిస్లోని తెలుగు ప్రవాసులు బ్యానర్లు, ప్లకార్డులతో ఆదివారం ప్రదర్శనలు చేపట్టారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపారు.
అమరావతే ముద్దు.. రైతులకు అండగా..
వర్జీనియాతోపాటు అంట్లాంటాలో కూడా ప్రవాసాంధ్రులు నిరసన ర్యాలీ చేపట్టారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేస్తూ.. ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. అమరావతిలో మహిళా రైతులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అమరావతి పరిరక్షణ సమితికి తమ వంతుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాగా, మూడు ప్రాంతాల అభివృద్ధి పేరిట అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని వాషింగ్టన్ డీసీలో ఉంటున్న ప్రవాసులు ఏపీ సర్కారును కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే రైతులు భూములు ఇచ్చారని.. ఇప్పుడు రాజధాని మారుస్తామంటూ మోసం జగన్ సర్కారు రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతిలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. తమను సంప్రదించకుండానే మూడు రాజధానులంటూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిందని రైతులు తెలిపారు. రాజధాని ప్రాంత రైతులు మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెలగపూడిలో దీక్ష చేస్తున్న రైతులు స్పష్టం చేశారు.
మంత్రులు కలవలేదు.. మేము కూడా
తాము ఏ మంత్రులనూ కలవలేదని, మంత్రులు కూడా తమను కలవలేదని రాజధాని రైతులు స్పష్టం చేశారు. ఇక మందడంలోనూ రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఓ ప్రైవేటు స్థలంలో రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా కమిషన్ సభ్యులు ఆదివారం రాజధాని ప్రాంతంలో పర్యటించగా.. అధికారులు కావాలనే వారి సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. రైతులతో కమిషన్ సభ్యులు ఎక్కువ సమయం కేటాయించకుండా చేశారని మండిపడ్డారు.
మాకు పండగ లేదు..
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ర్యాలీ తనకార్యకర్తల కోసమేనని అన్నారు. తెలుగు ప్రజలకు అతిపెద్ద పండగ అయిన సంక్రాంతిని జరుపుకునే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. కాగా, మూడు రాజధానులకు మద్దతుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సోమవారం తలపెట్టిన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. ర్యాలీకి అనుమతి లేకపోవడంోత ఆర్కేను పోలీసులు అరెస్ట్ చేశారు.