దేశానికి రెండో రాజధానిగా విశాఖపట్నం.. వైసీపీ సాయిరెడ్డి సంచలన ప్రకటన.. జగన్ సంకల్పమంటూ..
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై సెగ మళ్లీ పెరిగింది. వాతావరణం పరంగా విశాఖపట్నం సేఫ్ కాదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న క్రమంలోనే పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు తిరిగి గవర్నర్ చెంతకు చేరాయి. వీటిపై ఆయన నేడో రేపో నిర్ణయం తీసుకుంటారనగా, బిల్లుల వ్యవహారంపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం వివరాలు కోరినట్లు వెల్లడైంది. గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నవేళ.. ఏపీ కొత్త రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఏపీ రాజధాని మార్పు: రంగంలోకి మోదీ! - గవర్నర్కు పీఎంవో కాల్?.. ఇటు హైకోర్టూ కీలక ఆదేశాలు..
ఐసోలేషన్ నుంచే..
రాయ్ పూర్, రాంచీ లాగా ఉండిపోదామా? లేక ఐడియల్ నగరాలైన హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరులా ఎదుగుదామా? అన్నీ అనుకూలతలున్న విశాఖపట్నం రాజధానిగా పనికిరాదా? అంటూ సాయిరెడ్డి సవాళ్లు విసిరారు. విశాఖకు తుఫాన్లు, భూకంపాల ప్రమాదం ఎక్కువని, అక్కడ రాజధానిని నెలకొల్పడం ఏమాత్రం సబబు కాదంటూ ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు, వాటి ఆధారంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలకు ఆయన సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. కరోనా బారినపడి, ప్రస్తుతం హైదరాబాద్ లో ఐసోలేషన్ లో ఉన్న ఆయన ఫేస్ బుక్ ద్వారా చేసిన ప్రకనటను యథాతథంగా అందిస్తున్నాం..
వారికిదే తొలి సమాధానం..
‘‘అబ్బే బీచ్ లో రాజధానేంటని కొందరు.. అక్కడ తుపానులు , భూకంపాలొచ్చేస్తాయని భయపెట్టేవారు మరికొందరు.. చాలా దూరమైపోతుందని ఇంకొందరు.. ఇలా అడ్డం పొడువు వాదనలతో విషం కక్కేవారికిదే నా తొలి సమాధానం. కుల,మత ప్రాంతీయతత్వాలులేని మన వైజాగ్ సహజసిద్ధ కాస్మోపాలిటన్ సిటీ. అలాంటిదానికే ఎన్నో ఆపాదిస్తున్నారు. ఉద్యోగాల కల్పన నుంచి పెట్టుబడులను ఆకర్షించడం వరకు అనుకూలతల దృష్యా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులాంటి దక్షిణాది రాజధానులకు పోటీ ఇవ్వగల ఏకైక నగరమిది. రాజధానంటే నాలుగు బిల్డింగులేనన్న భ్రమలనుంచి మన మెదళ్లు బయటపడాలి. రాజధానంటే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేవారికి ఉపాధి కల్పించి కడుపులో పెట్టుకుని చూసుకోవాలి.
మెట్రో కూతలే తరువాయి..
విశాఖలో ఇప్పటికే అన్ని మౌలిక సదుపాయాలున్నాయి. ఒక్క మెట్రో రైలు కూతపెడితే చాలు. అటు భోగాపురం నుంచి అనకాపల్లివరకు మెట్రోకు సంబంధించిన వర్క్ నడుస్తోంది. అమరావతిలో ఇవే మౌళిక సదుపాయాలు కల్పించాలంటే లక్షన్నర కోట్లు కావాలి. అందులో పదో వంతుపెడితే విశాఖ పరిపాలనా రాజధానిగా వెలుగుతూ.. యువతకు ఉపాధికల్పిస్తూ విశ్వనగరంగా విరాజిల్లుతుంది. అసలు జీఎన్ రావు కమిటీకూడా రాజధానికి అనుకూలం విశాఖేనని, అక్కడ పెడితే అసలే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంపై అదనపు భారంకూడా ఉండదని తేల్చిచెప్పింది.
షాకింగ్: తెలంగాణలో కరోనా లోకల్ వ్యాప్తి.. రాబోయే నెల రోజులు డేంజరన్న ఆరోగ్య శాఖ..
సేఫ్ సిటీ కాకుంటే ఇవన్నీ ఎలా?
విశాఖ పాలనా రాజధానైతే నగరానికి మరింత శోభవస్తుంది. టూరిజంలో చూసుకున్నా తిరుపతి తర్వాత ఎక్కువమంది వచ్చేది ఇక్కడికే. తిరుపతి ఆధ్యాత్మిక డెస్టినేషన్ అయితే విశాఖజిల్లాలోని అరకు, లంబసింగి నుంచి కైలాసగిరి వరకు సహజసిద్ధ ప్రకృతి అందాల సిగ. అందుకే తూర్పుతీరంలోనే అత్యధికంగా పర్యాటకులొచ్చే నగరం వైజాగ్. రక్షణపరంగానే ద బెస్ట్ విశాఖ... వెస్ట్రన్ నేవల్ కమాండ్ ముంబైలో ఉంటే ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఉన్న సిటీ వైజాగే. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఎక్కువ కేంద్ర సంస్థలున్న నగరం విశాఖ. లైవ్ సబ్ మెరిన్ మ్యూజియమున్న ఏకైక నగరం. తుపానులు, భూకంపాలు వస్తే... సురక్షితం కాకపోతే ఇవన్నీ పెడతారా?
అవన్నీ సముద్రాన్ని ఆనుకుని లేవా?
రైల్వే జోన్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు , రోడ్ కనెక్టివిటీ ఉన్న నగరం దేనికీ దూరం కాదు. చెన్నై తమిళనాడుకు పూర్తిగా ఉత్తరంగా ఉంది. మహారాష్ట్రకు ముంబై, కేరళకు తిరునవంతపురం చివర్లోనే ఉన్నాయి. కర్ణాటకకు బెంగళూరు ఒక మూలనే ఉందన్న విషయం గుర్తించాలి. అంతెందుకు దేశరాజధాని ఢిల్లీ దేశానికి ఉత్తరంగానే ఉంది. ఎక్కడుందన్నదికాదు అభివృద్ధికి ఉన్న స్కోప్ ఎంత? కనెక్టివిటీలే ముఖ్యం. ఎడ్యుకేషన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ లో తొలి యూనివర్సిటీ స్థాపించింది, బ్రిటిష్ వారే అతిపెద్ద ఆస్పత్రి కట్టింది విశాఖలోనే. విశాఖలో వరదలు, తుఫాన్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారు.. మరి చెన్నై, ముంబై, తిరువనంతపురం, పనాజీ,పుదుచ్చేరి ఎక్కడున్నాయి? సముద్రానికి ఆనుకునిలేవా?
Recommended Video
దేశానికి రెండో రాజధాని విశాఖ..
అన్నింటికీ మించి అన్ని ప్రాంతాలనూ సమగ్రంగా అభివృద్ధిచేయాలన్న జగన్ ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక విశాఖ. అన్ని సహజవనరులున్న ఉత్తరాంధ్ర మిగతా ప్రాంతాలతో సమానంగా వృద్ధిచెందడానికి దోహదపడుతుంది. అసలు దేశానికే రెండో రోజాధానయ్యే అర్హతలున్న నగరం ఇది. నాగపూర్ , రాంచీలా ఉండిపోతామా? చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబైలా ఎదుగుతామా? అన్నది ప్రజలే తేల్చుకోవాలి. పైగా విశాఖ పరిపాలనా రాజధానైతే అమరావతి అభివృద్ధికొచ్చిన నష్టం లేదు. లెజిస్లేటివ్ క్యాపిటల్ గా కొనసాగుతుంది. సెక్రటేరియట్ రావడం వల్ల విశాఖ బ్రాండ్ వేల్యా మరింత పెరుగుతుంది. విశాఖ రాజధానైతే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యి రాష్ట్రానికి రెవెన్యూకూడా పెరుగుతుంది'' అని విజయసాయి రెడ్డి వివరించారు.