అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజే....!? సీఎం జగన్ సమాలోచనలు: ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదంతో వాయిదా..!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఒక్క రోజుకే పరిమితం కానున్నాయి. కరోనా ప్రభావంతో ఇప్పుడు సమావేశాలను ఏర్పాటు చేయటం శ్రేయస్కరం కాదని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో అయిదు కేసులు నమోదు కావటం..అందునా విజయవాడలో కొత్త కేసు బయటకు రావటంతో..ఆ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం మరింత జాగ్రత్తలు ప్రారంభించింది.
అందులో భాగంగా ఈ నెల 27 నుండి ప్రారంభించి..31వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు సభ ఆమోదం తీసుకోకుంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ప్రభుత్వ ఖజానా నుండి నిధులు ఖర్చు చేసేందుకు అనుమతి ఉండదు. దీంతో..తప్పని పరిస్థితుల్లో ఒక్క రోజుకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ముగించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నెల 26న రాజ్యసభ ఎన్నిక ల పోలింగ్ ఉండటం ఆ సమయంలోనూ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల పైన అటు స్పీకర్ కార్యాలయం..ఇటు ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసాయి.
ఒక్క రోజుకే అసెంబ్లీ పరిమితం..
ఈ నెల 26 రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నాడే గవర్నర్ ప్రసంగం..బడ్జెట్ ప్రతిపాదన..ఆమోదం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. 175 మంది ఎమ్మెల్యేలు..58 మంది ఎమ్మెల్సీలు ఉన్న పరిస్థితులు..అదే విధంగా అధికార యంత్రాంగం మొత్తం అసెంబ్లీ సమావేశాల కోసం తరలి రావాల్సి ఉంటుంది. దీంతో..కేవలం సభ్యులకు మాత్రమే ఎంట్రీ పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 26న ఉదయం గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభించి..ఆ ప్రసంగం అయిన వెంటనే రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ కు బ్రేక్ ఇవ్వటం..ఆ తరువా అదే రోజు సభలో రెండు నెలల పద్దులకు సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టి...ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అదే రోజు సభలో ఆమోదం పొందేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం.
బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు..ఆ వెంటనే ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదంతో ఒక్క రోజులోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తే..ఎక్కవ సమయం సభ్యులు ఒకే చోట ఉండాల్సిన అవసరం లేకుండా.. అదే విధంగా రాజ్యంగా పరంగా ఆబ్లిగేషన్ అయిన బడ్జెట్ ఆమోదం ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
స్పీకర్..సీఎం చర్చలతో తుది నిర్ణయం..
ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఒకే రోజులో మొత్తం ప్రక్రియ పూర్తి చేసే విధంగా ప్రతిపాదనలు అటు ముఖ్యమంత్రికి..ఇటు శాసన సభ స్పీకర్ కు ప్రతిపాదించనున్నారు. ఈ ప్రతిపాదన పైన వారిద్దరూ చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఒక్క రోజులో ఈ ప్రక్రియకు సాంకేతిక ఇబ్బందులు వస్తే మరో రోజు మాత్రం పొడిగించి సమావేశాలను నిరవధిక వాయిదా వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే, ఇప్పటికే కేంద్రం కరోనా అంశం పైన రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం జనతా కర్ఫ్యూను మరో మూడు రోజుల పాటు పొడిగించాలనే ఆలోచనలో ఉంది.
ప్రస్తుతం ఏపీలో పెద్దగా కరోనా ఎఫెక్ట్ లేకపోయినా..సరిహద్దు రాష్ట్రాలు..ఇతర దేశాల నుండి వస్తున్న వారితో ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. దీంతో..ముందస్తు చర్చల్లో భాగంగా.. అసెంబ్లీ సమావేశాలను సైతం ఒక్క రోజుకే కుదించి..అధికార ప్రక్రియ పూర్తి చేయటం పైన చర్చ సాగుతోంది. అయితే, రానున్న నాలుగు రోజుల్లో పరిస్థితి మెరుగైతే ఆలోచన మార్చుకోవటం.. లేక మరిన్ని కేసులు బయట పడితే అసలు సమావేశాల నిర్వహణ పైనే పునరాలోచన చేసే అవకాశాలు లేకపోలేదు.