ఆటోమొబైల్ కష్టాలు: ఏపీలో అశోక్లేలాండ్ ప్లాంట్ తాత్కాలికంగా నిలిపివేత
విజయవాడ: ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో విజయవాడలో ఉన్న దేశంలోనే రెండో అతిపెద్ద బస్సు, ట్రక్కు, ఎల్సీవీ ఉత్పత్తి సంస్థ అశోక్లేలాడ్ ప్రస్తుతానికి బస్సు అసెంబ్లింగ్ యూనిట్ లేదా ప్లాంటు నిర్మాణ పనులను నిలిపివేసింది. విజయవాడ నుంచి 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లవల్లి అనే గ్రామంలో ఈ ప్లాంటు ఉంది. ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా సాగుతుండటం, విడిభాగాల సేల్స్ లేకపోవడంతో కంపెనీ యాజమాన్యం తాత్కాలికంగా ఉత్పత్తి పనులను నిలిపివేసింది.
ఎన్నో ఆశల మధ్య పనులు ప్రారంభం
హిందూజా గ్రూపునకు చెందిన అశోక్లేలాండ్ సంస్థకు గతేడాది మార్చి 31న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో భూమిపూజ జరిగింది. ఈ యూనిట్లో ఏడాదికి 4800 బస్సులకు అసెంబ్లింగ్ చేయాలనే ప్రణాళికను యాజమాన్యం రచించింది. ఆరునెలల సమయంలో ఈ యూనిట్ను ప్రారంభిస్తామని అప్పటి సీఈఓ వినోద్ కే దాసరి చెప్పారు. ఇక ఇది అశోక్లేలాండ్ సంస్థకు సంబంధించి 8వ ప్రొడక్షన్ యూనిట్. ఇందులో బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాల అసెంబ్లింగ్ జరుగుతుందని దాసరి చెప్పారు. ఇక ఈ యూనిట్లో ప్రత్యక్షంగా 5వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
దారుణంగా పడిపోయిన అశోక్ లేలాండ్ సేల్స్
మల్లవల్లి గ్రామంలో ఉన్న ప్లాంటును ప్రస్తుతం నిలిపివేయాలని కంపెనీ నిర్ణయం వెనక ఆర్థిక పరిస్థితే కారణంగా తెలుస్తోంది. ఆగష్టులో అశోక్ లేలాండ్కు సంబంధించిన సేల్స్ దాదాపు 70శాతంకు పడిపోయాయి. చెన్నైలో ఉన్న యూనిట్ ఆగష్టులో 3,336 మాత్రమే సేల్ అయినట్లు తెలిపారు. గతేడాది ఇదే ఆగష్టులో సేల్స్ 11,137గా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇక మొత్తం వాహనాలను చూస్తే ఆగష్టులో 4,585 యూనిట్లు సేల్ అయినట్లు చెప్పిన అశోక్లేలాండ్ సంస్థ గతేడాది ఈ సంఖ్య 12,420గా ఉన్నట్లు తెలింపింది.
డిమాండ్ పెరిగితే విజయవాడ ప్లాంట్ను ప్రారంభిస్తాం
బస్ అసెంబ్లీ యూనిట్ కోసం మల్లవల్లి దగ్గర 75 ఎకరాల భూమిని సేకరించింది అశోక్ లేలాండ్.అంతేకాదు మరో 75 ఎకరాలు కూడా కావాలని ప్రభుత్వం ముందు విజ్ఞప్తిని పెట్టింది. ఇక అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం చేపడుతున్నందున ఈ ప్లాంట్ నుంచి 9,600 యూనిట్లును ఏటా విడుదల చేసేందుకు కంపెనీ పకడ్బందీగా స్కెచ్ వేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న ప్లాంట్ల నుంచి డిమాండ్ మేరకు కావాల్సిన సేల్స్ జరుగుతున్నాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. డిమాండ్ ఒకవేళ పెరిగితే విజయవాడ ప్లాంట్ను ప్రారంభిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ప్లాంట్ ప్రారంభం కాకపోవడంపై స్థానికులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్లాంట్ ప్రారంభం అయి ఉంటే ఆటోమొబైల్ రంగంలో ఏపీ పేరు మారుమ్రోగేదని మాజీ ఏపీ సీఐఐ ఛైర్మెన్ ఒకరు తెలిపారు.