వరంగల్ మున్సిపాలిటీకి అమీర్ఖాన్ ప్రశంసలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రంలోని వరంగల్ మున్సిపాలిటీకి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రశంసలు లభించాయి. అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న టెలివిజన్ కార్యక్రమం సత్యమేవ జయతేలో వేస్ట్ మేనేజ్మెంట్పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన వరంగల్ మున్సిపాలిటీ విధానాలను మెచ్చుకున్నారు. దేశంలో చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలు, శిశు మరణాలు, వివిధ సామాజిక సమస్యలపై ఈ కార్యక్రమం ద్వారా అమీర్ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
మార్చి 16న ప్రసారమైన సత్యమేవ జయతే కార్యక్రమంలో చెత్త చెదారాన్ని శుభ్రం చేయడంపై మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్య విధానాలను, నిధుల దుర్వినియోగం తదితర అంశాలను అమీర్ ఖాన్ ప్రస్తావించారు. చెత్త చెదారాన్ని డంపింగ్ యార్డుల్లో కాల్చడం వల్ల వచ్చే చర్మ సమస్యలపై, అనారోగ్య సమస్యలపై ఈ కార్యక్రమంలో పలువురు నిపుణులతో చర్చ జరిపారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లా మున్సిపాలిటీ సాధించిన విజయాన్ని అమీర్ ఖాన్ దేశ ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. వరంగల్ నగరాన్ని ఏడు రోజుల్లో శుభ్రపర్చడమే కాకుండా చెత్తా చెదారాన్ని రీ సైక్లింగ్ చేస్తూ ఆదర్శంగా నిలిచిందని అమీర్ తెలిపారు.
ఈ విధంగా చెత్తా చెదారాన్ని రీ సైక్లింగ్ చేస్తూ.. నగరాన్ని శుభ్రంగా ఉంచడంతోపాటు నగరానికి ఆదాయాన్ని సమకూర్చడంలో కీలక పాత్ర పోషించిన వరంగల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బి జనార్ధన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ల సేవలను అమీర్ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, కార్యక్రమంలో పాల్గొన్న జనార్ధన్ రెడ్డి, వివేక్ యాదవ్లు వరంగల్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చిన విధానాన్ని వివరించారు.