జగన్తో నో, అమిత్ షా క్లాస్: బాబుపై పురంధేశ్వరి స్వరం అందుకే తగ్గిందా?
అమరావతి: తెలుగుదేశం పార్టీ పైన, ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పైన బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణల వంటి నేతల స్వరం మారిందా? అంటే ఇటీవల పరిణామాలను చూస్తుంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏ విషయమైనా పురంధేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలు చంద్రబాబు ప్రభుత్వం పైన మండిపడేవారు. ఇటీవల కాలంలో వారి దూకుడు కనిపించడం లేదు. అంతేకాదు, ఇటీవల వీర్రాజు మాట్లాడుతూ.. ప్యాకేజీ పైన చంద్రబాబు అర్థం చేసుకున్నట్లే పవన్ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, వీరి దూకుడు తగ్గడం వెనుక బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసిపి.. బీజేపీతో పొత్తుకు తహతహలాడుతున్నట్లుగా వార్తలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. టిడిపి తెంచుకుంటే తాము ఎన్డీయేలో భాగస్వామి కావాలని ఉబలాటపడుతోందంటున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. వైసిపితో ఎట్టి పరిస్థితుల్లో దోస్తీ ఉండదని, చంద్రబాబుతో స్నేహాన్ని వదులుకోవద్దని సూచించారని తెలుస్తోంది. వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టాలని, పార్టీ జెండాను భుజాన వేసుకుని ప్యాకేజి గురించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
ఆ విషయం చెబుతాం
ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్రానికి రావాల్సిన వివిధ పథకాలపై ఒకరిపై ఒకరు విమర్శనాస్ర్తాలను సంధించుకున్న టిడిపి, బిజెపి నేతలు ప్రస్తుతం ఆ విషయాన్ని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ప్యాకేజీని చంద్రబాబు ఆహ్వానించడమే అందుకు ముఖ్య కారణం. అదే సమయంలో బీజేపీ నేతలు టిడిపిపై దూకుడు పెంచకపోవడానికి అమిత్ షా కారణమని అంటున్నారు. హోదా సాధ్యం కాదని, హోదాను మించి ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. హోదా అంశాన్ని పక్కన పెట్టి ప్యాకేజీతో వచ్చే లబ్ధిని ప్రజలకు వివరించాలని ఇప్పుడు టిడిపి, బిజెపిలు నిర్ణయానికి వచ్చాయి.
ఫిర్యాదును కొట్టిపారేసిన షా!
ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, టిడిపి నేతలు కానీ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై సంతృప్తి వ్యక్తం చేయలేదని తొలుత ఏపీ బీజేపీ నేతలు అమిత్ షాకు ఫిర్యాదు చేశారని సమాచారం. పైగా ఇచ్చింది తీసుకుని, రానిదాని కోసం పోరాడతామని ప్రకటన కూడా చేశారంటూ షా దగ్గర ప్రస్తావించారట. ఈ సమయంలో సొంత పార్టీ నేతలకు అమిత్ షా సూచనలు చేశారని తెలుస్తోంది. మీరు సొంత అజెండాలు పక్కన పెట్టి, టిడిపితో కలిసి పోవాలని సూచించారని తెలుస్తోంది. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సూచించారు.
అందుకే స్వరం మారింది
ఈ కారణంగా బీజేపీ నేతల వైఖరి మారిందని అంటున్నారు. ఎప్పుడూ టిడిపిపై విరుచుకుపడే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ కేంద్ర మంత్రులు కావూరి సాంబశివ రావు, పురంధేశ్వరి, మాజీ రాష్ట్ర మంత్రి కన్నాల స్వరం అందుకే మారిందంటున్నారు. అందుకే, విమర్శలు మాని సలహాలిస్తున్నారని అంటున్నారు. ప్యాకేజీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడం ప్రారంభించారు.
జగన్తో కలిసే పరిస్థితి లేదు
2014 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతల వ్యవహార శైలిపై ఇతర పార్టీ నేతలు హైకమాండ్కు ఫిర్యాదు చేశారని మరో వాదన కూడా ఉంది. పార్టీలోకి కాంగ్రెస్ నేతలు వచ్చి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో అమిత్ షా క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. రాష్ట్రంలో అవినీతి ముద్ర ఉన్న వైసిపితో, కాంగ్రెస్ పార్టీతో కలిసే పరిస్థితి లేదని, టిడిపితో కొనసాగాలని అమిత్ సూచించారట.