వైఎస్ జగన్కు హోంమంత్రి అమిత్ షా ఫోన్: కరోనాపై ఏపీ సీఎం వివరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు తీరుపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
అమెరికాపై కరోనా దెబ్బ: నలుగురిలో ఒకరి ఉద్యోగం ఊడింది, 4 కోట్ల మంది నిరుద్యోగ భృతి
హోంమంత్రికి జగన్ వివరణ
ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై జగన్ హోంమంత్రికి వివరించినట్లు తెలిసింది. పలు సడలింపులతో కేంద్ర ప్రభుత్వం మే 31 వరకు విధించిన లాక్డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై కేంద్రం దృష్టి సారించిన విషయం తెలిసిందే.
ప్రధానికి సీఎంల అభిప్రాయాలు..
ఇప్పటికే గురువారం రాత్రి వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా సంప్రదింపులు, చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతోనూ అమిత్ షా శుక్రవారం భేటీ అయిన విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లోని కరోనా, లాక్డౌన్ పరిస్థితులను, సీఎంల అభిప్రాయాలను ప్రధానికి వివరించినట్లు సమాచారం. లాక్ డౌన్ పొడిగింపుపైనా చర్చించినట్లు తెలిసింది. కాగా, ఆర్థిక కార్యకలాపాలు అనుమతిస్తూ లాక్ డౌన్ ను కొనసాగిస్తే మంచిదని పలువురు ముఖ్యమంత్రులు అమిత్ షాతో చెప్పినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి ఎలా ముందుకెళ్లాలనే దానిపై సీఎంలు తమ అభిప్రాయాలు తెలిపారు.
మరోసారి ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ఇది ఇలావుండగా, ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 85 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసులు సంఖ్య 3330కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో 33 మంది రాష్ట్రంలోని వారు కాగా, మిగితా కేసులన్నీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారుగా వెల్లడించింది. తాజాగా, ఒకరు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 60కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2037 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 777 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.